నర్సంపేట, మార్చి 21 : కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టపరిహారంపై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉందని, గత సంవత్సరం వడగండ్లతో పంటలు దెబ్బతిన్నాయని, కానీ, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అక్కడి రైతులకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్టలో కూడా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలో వడగండ్లతో నష్టం జరిగిందని, కానీ ఇప్పటివరకు సర్వే కూడా చేయించలేదని చెప్పారు. ఇక్కడ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంట నష్టంపై సర్వే చేయించి నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. 76,625 ఎకరాల్లో మక్కజొన్న, వరి 23,093, మామిడి 4,531, పుచ్చ 210, మిర్చి 3,713, పెసర 89 ఎకరాలు, ఇతర పంటలకు 2,931 ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. 71,929 మంది రైతులకు చెందిన మొత్తం 1,11,231 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటతో పాటు భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో కూడా నష్టం జరిగిందని తెలిపారు. నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు కాబట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను ఆదుకుంటున్నారన్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదని సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో గత మక్కజొన్న 7,547 ఎకరాలు, మిర్చి 22 వేల ఎకరాలు మొత్తం 28,526 ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. నష్ట పరిహారం కింద రూ.13.86 కోట్లు మంజూరయ్యాయని, మొదటి దఫా రూ.8.89 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పట్టుబట్టి నర్సంపేటకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఒక హెక్టారుకు మిర్చికి రూ. 13,800 నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమని, కానీ చట్టమే ఆ విధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సంపేటకు రాబోతున్నారని, దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.200కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రైతు వేదికల ద్వారా క్లస్టర్ల వారీగా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు.
గతంలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని, రాష్ట్రంలో తొలిసారి చెక్కుల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు రాజకీయాలకు అతీతంగా చెక్కులను అందిస్తున్నామన్నారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు నష్టపరిహారం పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. రెండు మూడు రోజుల్లో మొత్తం రైతులకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జేడీఏలు ఉషాదయాళ్, శ్రీనివాసరావు, ఓడీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఇన్చార్జి ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ రామ్మూర్తి, రైతు బంధు సమితి రాష్ట్ర బాధ్యుడు రాయిడి రవీందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ మూరాల మోహన్రెడ్డి, మోతె జైపాల్రెడ్డి, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమండ్ల జయమ్మ, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, నల్లా మనోహర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆదుకుంటాం.. అధైర్యపడొద్దు..
దుగ్గొండి : వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. మండలంలోని అడవి రంగాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ రంగనాథ్తో కలిసి మంగళవారం దెబ్బతిన్న పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట చేతికందే సమయానికి అకాల వర్షంతో దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. రైతులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చారు. దుగ్గొండి, ఖానాపురం మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అకాల వర్షంతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. రైతులు అధైర్య పడొద్దని, పంట నష్టం అందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. ఏసీపీ సంపత్రావు, ఆర్డీవో మహేందర్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఏడీఏ అవినాశ్, తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఏవో దయాకర్ పాల్గొన్నారు.