హనుమకొండ, ఏప్రిల్ 22 : ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో జరిగిన నష్టాలను వెంటనే అంచనా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ఏయే చోట్ల వడగండ్లు కురిశాయి? ఏ మేరకు పంటలు నష్టాలకు గురయ్యాయి?
ఎంత మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది? పంట నష్టాలు ఎన్ని ఎకరాల్లో.. ఎంత మేరకు ఉందనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. శనివారం సాయంత్రం భారీగా గాలులు వీస్తూ కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడానని, పంట నష్టం అంచనాలు వేశాక, తగిన విధంగా పరిహారం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి, పంట నష్టాల అంచనాలు వేయడంతో పాటు, రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.