హనుమకొండ, జనవరి 4 : రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని దేవాదుల ప్రాజెక్టు పురోగతి పనులపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. ముందుగా అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేవాదుల ప్యాకేజీ కింద వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయని తెలిపారు.
గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి రీ టెండర్ పెట్ట్టించినా పనులు అనుకున్నంత వేగం గా జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఒప్పించి భూ సేకరణ చేసినా కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, వర్ధన్నపేట, పెద్ద వంగర మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఇప్పటి వరకు నీరు రావడం లేదని మండిపడ్డారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఎందుకు పూర్తి కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో లోపాలు సరిదిద్దుకొని రానున్న వేసవిలోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ సమీక్షించేలోగా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి, జనగామ కలెక్టర్ శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.