కొడంగల్(దుద్యాల)/మద్దూర్/కోస్గి/మర్పల్లి, ఆగస్టు 15 : కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై నిజాలు రాస్తే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై విషం చిమ్ముతారా? అని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, మహిపాల్, శివకుమార్, బసప్ప, సురేష్శ్ రాజ్, సాయి కుమార్, మడిగె శ్రీనివాస్, రాము నాయక్, గోపాల నాయక్ తదితరులు ప్రశ్నించారు. శనివారం హకీంపేటలో కబ్జాకు గురైన రైతుల స్థలంలో వారు మీడియాతో మాట్లాడారు. హకీంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి చేసిన భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక నిజాలు రాస్తే మింగుడు పడక పత్రికపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పేద రైతులకు అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపైనా దురుసు వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ‘నీకు దమ్ముంటే రైతుల భూములను కబ్జా చెయ్యలేదని నిరూపించు. అంతేకాని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు’ అని నర్సింహారెడ్డిని హెచ్చరించారు.
‘మీ కబ్జాలను ప్రశ్నించిన మా పార్టీ నేతలతోపాటు వాస్తవాలను ప్రచురితం చేస్తున్న నమస్తే తెలంగాణ పత్రికపై చిల్లర ఆరోపణలు చేస్తారా?’ అంటూ నారాయణపేట జిల్లా మద్దూర్, కోస్గి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా హకీంపేటకు చెందిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట రైతుల భూములను అన్యాయంగా.. అక్రమంగా దోచుకొని మింగుతుంటే.. వాస్తవాలను ప్రచురిస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నిజాలను బయట పెట్టారన్న అక్కసుతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై చిల్లర ఆరోపణలు చేస్తున్న అధికార పార్టీ నేత నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని శనివారం మద్దూర్లో మున్సిపల్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు, కోస్గిలో బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట నర్సింహులుతోపాటు పలువురు నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, పాలకులను ప్రశ్నించే బాధ్యతను నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికను కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ మధుకర్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గఫార్ అన్నారు. రెండు రోజుల క్రితం కొడంగల్లో కాంగ్రెస్ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికను కించపరుస్తూ మాట్లాడటాన్ని వారు ఖండించారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులకు నిజాయితీ ఉంటే నమస్తే తెలంగాణ పత్రికలో అవినీతిపై వచ్చిన కథనాలు తప్పని రుజువు చేయాలని అన్నారు. నమస్తే తెలంగాణ యాజమాన్యానికి సదరు నాయకుడు నర్సింహారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.