తొర్రూరు, ఏప్రిల్ 13 : పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను తొలగించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలేరుపై వంతెన కోసం రూ.8.70కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇవ్వగా స్థానిక రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొర్రూరు మండలం కరాల శివారు పాలేరు వాగులో ఏడాది పొడవునా ఇప్పుడు నీరు ఉంటున్నది. దీంతో వాగుదాటి తమ పొలాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. గ్రామ శివారులో సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చే మానాపురం ప్రాంతంలో గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులకు సంబంధించి 600 ఎకరాల దాకా సాగుభూములున్నాయి. గతంలో వర్షాకాలంలో కొన్ని రోజులే వాగును దాటాలంటే ఇబ్బందులుండేవి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాది పొడవునా పాలేరు వాగులో నీటి ప్రవాహం ఉంటున్నది. గ్రామ పరిధిలో ప్రవహించే వాగుపై రెండు చెక్ డ్యామ్లు నిర్మించడంతో సుమారు 12 నుంచి 15 అడుగుల లోతు వరకు ఐదు కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉంటోంది. దీంతో ట్రాక్టర్లు, ఆటోలు అద్దెకు తీసుకొని సమీపంలోని రావులపల్లి మీదుగా అవతల ఉన్న పంట క్షేత్రాలకు వెళ్లాల్సి వస్తున్నది.
గ్రామం నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో కనిపించే పొలాల వద్దకు చేరుకునేందుకు పది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితికి మంత్రి ఎర్రబెల్లి కృషితో ఇక విముక్తి కలుగనున్నది. పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో దంతాలపల్లి మండల కేంద్రానికి, పెద్దముప్పారం గ్రామానికి చేరుకునేందుకు, సూర్యాపేట జిల్లా పరిధిలోని మానేపురం తండా, ఏనేకుంటతండా, పప్పులోని తండా, కుకడం దేవాతండాకు దూర భారం తగ్గనున్నది. హరిపిరాల, కర్కాల, బొమ్మకల్ పరిసర ప్రాంతాల వారంతా సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 15 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దయాకర్రావు చొరవతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ గ్రామస్తులంతా వచ్చే ఎన్నికల్లో మంత్రికి అండగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నారు.
నిరీక్షణ ఫలించింది
మంత్రి దయాకర్రావు ప్రజల మనసెరిగి పనులు చేస్తున్నరు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అధిక నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరిస్తున్నరు. కర్కాల వద్ద పాలేరుపై బ్రిడ్జి నిర్మిస్తే ఎన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మంత్రి ఉత్తర్వులు ఇవ్వడంతో మా నిరీక్షణ ఫలించినట్లయింది.
– మంగళపల్లి శ్రీనివాస్, జడ్పీటీసీ
మంత్రికి రుణపడి ఉంటం
పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి దయాకర్రావు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన క్షణంలో నేను ఉప్పొంగిపోయా. ఎన్నో ఏళ్లనుంచి ఈ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అడుగుతున్నారు. మంత్రి దయాకర్రావు అందించిన సహకారంతో ప్రజలంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మేమంతా మంత్రికి రుణపడి ఉంటం.
–సెగ్గెం సురేఖ, సర్పంచ్
బాధలు తీరినట్లే
ఊరు పక్కనే పొలాలున్నా రోజూ ఆటోలో 10 కిలోమీటర్లు పోవాల్సిందే. రైతులమంతా కిరాయిలు పెట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నం. నాలుగేళ్ల నుంచి వాగు నిండా నీళ్లే. వాగు దాటాలంటే భయమే. ఇక బ్రిడ్జి నిర్మిస్తామని మంత్రి దయాకర్రావు చల్లని మాట చెప్పిండు. మా ఊరోళ్లమంతా దయాకర్రావు ఎంబడే ఉంటం.
– వడ్లకొండ పద్మ, రైతు కూలి