కాశీబుగ్గ, జూలై 17 : తెలంగాణ రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై సోమవారం కొత్తపేటలోని రైతు వేదికలో 3,14వ డివిజన్ల రైతులతో రైతు బంధు సమితి వరంగల్ మండల కోఆర్డినేటర్ బుద్దే శ్రీనివాస్ అధ్యక్షతన మేలుకో రైతన్న సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అరూరి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలిడేలు ప్రకటించారని గుర్తు చేశారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రె స్ నాయకులను పొలిమేరలోకి రాకుండా తరమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో రైతన్నలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరంట్ కష్టాలను ఎలా మర్చిపోతామన్నారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని సీఎం కేసీఆర్ ఉద్యమ జెండా ఎత్తుకొని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఎన్నో విప్లవాత్మక పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. 9 ఏళ్లలోనే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్ఎస్ సంకల్పిస్తుంటే మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహ విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు.
మూడు పంటల బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కాంగ్రెస్ కావాలా? అనేది తెలంగాణ రైతులే తేల్చుకోవాలన్నారు. ఉచిత కరెంట్ వద్దన్న కాంగ్రెస్ లీడర్లను ఊరి పొలిమేరదాకా ఉరికించాలని పిలుపునిచ్చారు. గత పాలకులు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. వారి అడుగు జాడలలోనే రేవంత్రెడ్డి నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి, ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సాగునీరు లాంటివి ఎత్తివేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. గతంలో సరిపడా విద్యుత్ లేక వ్యవసాయ బావిల దగ్గర మోటర్లు, స్టాటర్లు కాలిపోయేవన్నారు. ఎరువుల కోసం రాత్రింబవళ్లు కాపాలాకాసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. రైతులకు కరంట్ మీటర్లు ఏర్పాటు చేస్తే కేంద్రం రూ.30వేల కోట్లు నజరారా ఇస్తానన్నా సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. అనంతరం రైతు వేదిక ఎదుట ఎమ్మెల్యే అరూరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను షీబారాణీ అనిల్, తూర్పాటి సులోచనా సారయ్య, వరంగల్ మండల పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, 3వ డివిజన్ అధ్యక్షుడు, పీఏసీఎస్ డైరెక్టర్ నెరేళ్ల రాజు, 14 డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహా, నాయకులు ఎల్లావుల కుమార్ యాదవ్, మంతుర్తి కుమార్ యాదవ్, లింగం కోటి, జన్ను స్వామిదాస్, షేక్ ఆదాం, జన్ను సారంగపాణి, ఇట్యాల సతీశ్, దయ్యాల వేణు, నాగవరపు సుదర్శన్, నర్సింగుల సురేశ్ యాదవ్, పత్రి సుభాష్, కేతిరి రాజశేఖర్, పత్రి రాజపోశాలు, గంధం గోవిందు, గండ్రాతి భాస్కర్, జన్ను రాజయ్య, మోత్కురి రాజమౌళి, పండుగ రవీందర్రెడ్డి, బొచ్చు రాజు, కారబోయిన భిక్షపతి, ఎల్లంశెట్టి వంశీ పాల్గొన్నారు.
గత పాలకులు నిర్లక్ష్యం చేశారు
గత పాలకులు వ్యవసాయ రంగాన్ని, రైతులను నిర్లక్ష్యం చేశారు. సీఎం కేసీఆర్ సార్ రైతుల కష్టాలను గుర్తించి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ప్రస్తుతం దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ వ్యవసాయం రంగం నిలిచింది. వ్యవసాయంతోనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ సర్కార్ గుర్తించింది.
-దయ్యాల వేణు, ఆరెపల్లి రైతు
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది..
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ గుర్తించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పంజాబ్ రాష్ర్టాన్ని మించి ఇక్కడ వ్యవసాయం దిగుబడి వస్తోంది. గతంలో ఒక్క పంటకే నీరు అందక ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం మూడు పంటలు వేసేందుకు ఇష్టపడుతున్నాం. 24 గంటలు కరెంటు సరఫరా, అందుబాటులో నీరు ఉండడంతో రైతులు అబివృద్ధి చెందుతున్నాం. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి.
– నాగవరపు సుదర్శన్, కొత్తపేట రైతు