పేదల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నది. మౌలిక వసతులనూ కల్పిస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ సబ్ సెంటర్లకు పక్కా భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఆరోగ్య ఉపకేంద్రాలను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్నది. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రతి వెల్నెస్ సెంటర్లో ఒక డాక్టర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు విధులు నిర్వర్తించేందుకు అనుగుణంగా సొంత భవనాలను నిర్మిస్తున్నది. జిల్లాలో 77 కేంద్రాలకు రూ.13.64 కోట్లు విడుదల కాగా, ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. మరికొన్నింటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
వరంగల్, మార్చి 12(నమస్తేతెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన)లను నెలకొల్పుతున్నది. సబ్ సెంటర్లన్నింటినీ విడుతల వారీగా వెల్నెస్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నది. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బందితో పాటు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ విధులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం హెల్త్ వెల్నెస్ సెంటర్ల కోసం సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి సారించింది. దశల వారీగా నిధులు కేటాయిస్తున్నది.
ఇప్పటికే జిల్లాలో మూడు విడుతల్లో 77 హెల్త్ వెల్నెస్ సెంటర్లకు రూ.13.64 కోట్లు మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ నిధులతో భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రతి హెల్త్ సెంటర్కు నాలుగు గదులతో భవనం నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లు పనిచేస్తున్నాయి. ఎక్కువగా మండలానికో పీహెచ్సీ ఉంది. కొన్ని మండలాల్లో రెండేసి ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో నాలుగైదు గ్రామాలకు ఒకటి చొప్పున హెల్త్ సబ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆయా హెల్త్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంతో పాటు ఆశ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పీహెచ్సీలో మాత్రమే క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు.
మెడికల్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన తాను పనిచేస్తున్న పీహెచ్సీ పరిధిలోని హెల్త్ సబ్ సెంటర్లను పర్యవేక్షిస్తున్నారు. దీంతో హెల్త్ సబ్ సెంటర్ పరిధిలోని గ్రామాల ప్రజలు పీహెచ్సీకి వెళ్లాల్సిన పరిస్థితి. కొందరు తమకు దూరంగా ఉన్న పీహెచ్సీకి వెళ్లలేక ప్రైవేట్ నాన్ క్వాలిఫైడ్ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. డబ్బు ఖర్చు చేసుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి తెరదించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయా పీహెచ్సీల పరిధిలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్లన్నింటినీ హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి వెల్నెస్ సెంటర్లో క్వాలిఫైడ్ డాక్టర్ను నియమిస్తున్నది. ఒక ఎంబీబీఎస్ లేదా బీఎంఎస్ వైద్యుడు విధులు నిర్వర్తించేలా సెంటర్లను అభివృద్ధి చేస్తున్నది. సెంటర్లో డాక్టర్తో పాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నట్లు డీఎంహెచ్వో వెంకటరమణ చెప్పారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 14 పీహెచ్సీలు ఉంటే వీటి పరిధిలో 118 హెల్త్ సబ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిలో 82 సబ్ సెంటర్లను హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మెజారిటీ సబ్ సెంటర్లు అరకొర వసతులతో కూడిన ఇరుకైన అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సెంటర్కు ఒక సొంత భవనం నిర్మించేందుకు విడుతల వారీగా నిధులు ఇస్తున్నది. తొలి విడుత రూ.16 లక్షల చొప్పున 40 సెంటర్ల భవనాల కోసం రూ.6.40 కోట్లు కేటాయించింది.
మెటీరియల్ రేట్లు పెరగడంతో ఒక్కో భవనానికి కేటాయించే మొత్తాన్ని రూ.18 లక్షలు, రూ.20 లక్షలకు పెంచింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున 29 సెంటర్లకు రూ.5.80 కోట్లు మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్నెస్ సెంటర్ భవనం వారీగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం 69 భవనాలకు గాను 39 భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో రాయపర్తి మండలం సన్నూరు, నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామంలో భవనాల నిర్మాణం పూర్తయింది.
చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, కోనాపురం, ఉప్పరపల్లి, నర్సంపేట మండలం లక్నేపల్లి తదితర గ్రామాల్లో భవనాల నిర్మాణం చివరి దశకు చేరింది. ఇతర గ్రామాల్లో నిర్మాణ పనులు పునాది, బేస్మెంట్, లెంటల్, స్లాబ్ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా 30 సెంటర్ల భవనాల పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రతి వెల్నెస్ సెంటర్లో డాక్టర్, ఏఎన్ఎం, ల్యాబ్, వార్డు గది ఉండేలా భవనం నిర్మిస్తున్నారు. రూర్బన్ పథకం ద్వారా కూడా ప్రభుత్వం పర్వతగిరి మండలంలో మరో ఎనిమిది వెల్నెస్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కో భవనానికి రూ.18 లక్షల చొప్పున 1.44 కోట్లు మంజూరు చేసింది. వీటిలో చింతనెక్కొండ, అన్నారంతో పాటు మరో గ్రామంలో చేపట్టిన భవనాల నిర్మాణం పూర్తికాగా రోళ్లకల్, ఏనుగల్, దౌలత్నగర్, చౌటపల్లి గ్రామాల్లో వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.