ములుగు, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు రోజు రోజుకూ సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి విషయాన్ని ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘మై మేడారం యాప్’ను శనివారం మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ అంబరీష్ ఆవిష్కరించారు. ఎడ్లబండి నాటి నుంచి గాలి మోటర్ వరకు వచ్చిన సౌకర్యాలతో పాటు ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరలో కల్పిస్తున్న మౌలిక వసతులు, ముఖ్య ఘట్టాల సమాచారాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
జాతరలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రాంతాలు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, తప్పిపోయిన వారి కోసం మైక్ల ద్వారా పిలిచే కేంద్రాలు, ఫైర్ ఇంజిన్ కేంద్రాలు తదితర మౌలిక వసతుల వివరాలను ఈ యాప్లో పొందుపర్చారు. అలాగే మొదటి రోజు సారలమ్మ, రెండో రోజు సమ్మక్క ఆగమనం, మూడో రోజు భక్తులు మొక్కులు చెల్లించే విధానం, నాలుగో రోజు తల్లుల వనప్రవేశం వివరాలను పొందుపర్చారు.