ఏటూరునాగారం/తాడ్వాయి, ఫిబ్రవరి 24 : మేడారం జాతర ముగిసింది. జాతర పరిసరాలన్నీ చెత్తాచెదారం, భక్తులు వదిలేసిన వ్యర్థాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, కొంగల మడుగు, ఊరట్టం, నార్లాపూర్, స్తూపం, జంపన్నవాగు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది. ఇక ప్లాస్టిక్ బాటిల్స్, మద్యం బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడే వదిలేశారు. మేకలు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోయి కంపుకొడుతున్నాయి. దీనికి తోడు అనేక చోట్ల ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, చేతి పంపుల వద్ద నీళ్లు నిలిచి బురదగుంటలు ఏర్పడి ఉన్న భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉద్యోగులు, వర్కర్లకు సమకూర్చిన భోజన వ్యర్థాలు కూడా అక్కడే పడేసి ఉన్నాయి. వీటిని తొలగించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో వాసన గుప్పుమంటోంది.
సుమారు 4వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.గత జాతరలో మెరుగైన పారిశుధ్య పనులు నిర్వహించిన పంచాయతీ అధికారులు ఈ సారి చేతులెత్తేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో పారిశుధ్యం పేరుకుపోయి జాతర పరిసరాలు కంపుకొడుతున్నాయి. దుర్గంధ వెదజల్లుతుండడంతో అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు, భక్తులు కోరుతున్నారు. తల నీలాలు సమర్పించిన ప్రదేశాల్లో కూడా అపరిశుభ్రతతో ఉన్నాయి. కొన్ని చోట్ల భక్తులు వారు విడిది ఉన్నచోటనే మల, మూత్ర విసర్జన చేయడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అధికారులు పక్కా ప్రణాళికతో మేడారం జాతర పరిసరాలు క్లీన్ చేయించాలని సమీప గ్రామాల ప్రజలు, భక్తులు కోరుతున్నారు.