న్యూఢిల్లీ, ఆగస్టు 7: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే శుక్రవారం మక్కాలో ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది అన్ని దేశాలపై దాడిగా పరిగణించడం జరుగుతుంది. మక్కాలోని అల్-సఫా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఉమ్మడి రక్షణ కోసం జరిగిన మక్కా అల్-ముకరమా శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఈ ఒప్పందం ఏ విధమైన దురాక్రమణ చర్యకైనా వ్యతిరేకంగా సమిష్టి నిరోధక శక్తిని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు దేశాలలో దేని పైనైనా జరిగే సాయుధ దాడిని, ఆ దేశాలన్నింటిపైనా జరిగిన దాడిగానే పరిగణించాలని ఇది నిర్దేశిస్తుంది. అంతేగాకుండా, ఈ మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మెరుగుపరచడానికి కూడా ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని ప్రకటన పేర్కొంది. ఇలా ఉండగా ఈ ఒప్పందాన్ని భారత్ నిశితంగా గమనిస్తున్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
యెమెన్, సౌదీ అరేబియాలపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 58 మంది ప్రభుత్వ సైనికులు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని నజ్రాన్ ప్రాంతంపై జరిగిన ఈ దాడుల కారణంగా పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడంతో అత్యవసర రెస్క్యూ బ్యూరోలు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను ఆ జలసంధిలో ప్రయాణించకుండా నిరోధించేందుకు ఇరాన్ పార్లమెంట్ కొత్త బిల్లును పరిశీలిస్తున్నది. ఈ ప్రాంతంలో నెలకొన్న భద్రతా ముప్పు కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా పెరిగాయి.