సిటీబ్యూరో: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులను సక్రమంగా అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఇతర ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలన్నింటిని తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 12,13న ఎమ్మార్వో ఆఫీసుల్లో వినతి పత్రాలు సమర్పిస్తామని, ఆగస్టు 19న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని ఆ తర్వాత అందరు ఉపాధ్యాయులను కలుపుకొని ఆగస్టు 29 న ఇందిరాపార్ వద్ద మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. చివరగా అసెంబ్లీ సందర్భంగా చలో అసెంబ్లీ కి కూడా వెనుకాడమని నాయకులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారావు, శ్యామ్ సుందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.