కంటోన్మెంట్: మహిళలకు పంచిపెట్టాల్సిన ఇందిరమ్మ చీరలు కంటోన్మెంట్ వర్క్షాపులో గుట్టలుగా పేరుకుపోయి దుమ్ముధూళితో నిండి ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శుక్రవారం కంటోన్మెంట్ వర్క్షాపులో పేరుకుపోయిన ఇందిరమ్మ చీరలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే శ్రీగణేశ్, నాయకులు గత నవంబర్లో పంచాల్సిన చీరలను మహిళా గ్రూపులకు పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాప్లో నిల్వ ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది నవంబర్లో అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారని తొమ్మిది నెలలు పూర్తయినా కంటోన్మెంట్లోని మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దసరా పండుగ ముందే బతుకమ్మ చీరలను ప్రతి ఒక్క మహిళకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వేలాది ఇందిరమ్మ చీరలను వర్క్షాపులో పెట్టాల్సిన అవసరం ఏముందని, దీనిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటరాముడు, నారాయణ, కల్యాణ్ సందీప్, శ్రీనివాస్, రిచర్డ్ పాల్గొన్నారు.