తాడ్వాయి, జనవరి17 : వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
చల్లంగ చూడు సమ్మక్క తల్లీ అంటూ వేడుకున్నారు. అనంతరం జాతర పరిసరాల్లో విడిది చేసి సరదాగా గడిపారు. వాహనాలు వేలాదిగా రావడంతో పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూశారు. గద్దెల సమీపంలో తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లలో పంపించారు. 50వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.