ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కార్పొరేటర్లు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 41 డివిజన్లలో నగర బాట కార్యక్రమం పూర్తి చేశామని, ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
వరంగల్/ఖిలావరంగల్, ఆగస్టు 24: సమస్యల పరిష్కారానికే నగర బాట కార్యక్రమం చేపట్టానని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం ఆమె 32 నుంచి 41వ డివిజన్ వరకు సుడిగాలి పర్యటన చేశారు. కమిషనర్ ప్రావీణ్య, బల్దియాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి ఆయా డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించారు. అప్పటికప్పుడు పరిష్కారించేలా అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. 32వ డివిజన్లో బీఆర్నగర్ నుంచి నగరబాటను ప్రారంభించిన మేయర్.. 33, 34, 35, 36, 37, 38, 39, 40వ డివిజన్లో పర్యటిస్తూ 41వ డివిజన్లోని నాగమయ్య నగర్లో ముగించారు. గతంలో 1వ డివిజన్ నుంచి 31వ డివిజన్ వరకు నగరబాటను నిర్వహించిన తర్వాత ఒకేరోజు 10 డివిజన్లలో అధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించారు.
అభివృద్ధి పనుల మంజూరు
నగర బాటలో డివిజన్లలో పర్యటించిన మేయర్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను స్థానిక కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకొచ్చారు. సమస్య తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో వారు అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేశారు. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 32వ డివిజన్ బీఆర్నగర్లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానను పరిశీలించిన సుధారాణి.. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయకనగర్లో డ్రైనేజీలకు మరమ్మతులు చేపట్టాలని, గాయత్రినగర్లో తాగునీటి లీకేజీలను వెంటనే అరికట్టాలని కార్పొరేటర్ పల్లం పద్మ కోరారు. స్పందించిన మేయర్ ప్రతిపాదనలు చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. 40వ డివిజన్లోని సీఆర్సీ భవన్ ఆవరణలో వెండర్స్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ మరుపల్ల రవి కోరారు. సీఆర్సీ భవన్ నుంచి పోచమ్మ ఆలయం వరకు రోడ్డు ఆధ్వానంగా ఉందని తెలిపారు.
వెంటనే ప్రతిపాదనలు చేయాలని మేయర్ ఇంజినీర్లను ఆదేశించారు. 41వ డివిజన్లోని నాగమయ్యనగర్లో గుంతలను పూడ్చాలని కార్పొరేటర్ పోశాల పద్మ విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు. శివనగర్, ఖిలావరంగల్, చింతల్ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, సిటీ ప్లానర్ వెంకన్న, ఇన్చార్జి ఎస్ఈ రాజయ్య, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ బషీర్, శ్రీనివాస్రెడ్డి, ఏఈ హబీబుద్దీన్, సతీశ్, శానిటరీ సూపర్వైజర్ మాదాసి సాంబయ్య, అధికారులు పాల్గొన్నారు.