పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో వ్యాపార వాణిజ్య రంగాలు కుదేలవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ ధరలు పెంచుతుండడంతో సామాన్యుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. లీటర్ పెట్రోల్ రూ.119.39, డీజిల్ రూ.105.39 ఉండగా గ్యాస్ రూ.వెయ్యి దాటి చుక్కలు చూపిస్తోంది. డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, వెంకటాపురం(నూగూరు) ఇసుక క్వారీల నుంచి ఇసుక రవాణా చేసే లారీ యజమానులు గురువారం జిల్లా కేంద్రంలో లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రవాణా బంద్ను పాటించారు.
ములుగు, మే19 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా పెట్రోలియం ఉత్పత్తులతో పాటు గ్యాస్ ధరలను రోజు రోజుకూ పెంచుతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. దీంతో రవాణా రంగంతో పాటు నిత్యావసరాలపై త్రీవ ప్రభావం చూపుతున్నది. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటడంతో పాటు లీటర్ పెట్రోల్ రూ.119.39, డీజిల్ రూ.105.39 చేరింది. దీంతో సామాన్యుడి సంపాదనలో అధిక భాగం నిత్యవసరాల సరుకులతో పాటు గ్యాస్ సిలిండర్ల ఖర్చులకే వెళ్తుండటంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. లారీలను నమ్ముకొని జీవిస్తున్న యజమానులకు ఖర్చులు సైతం మిగలడం లేదని వాపోతున్నారు. ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, వెంకటాపురం(నూగూరు) ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్, వరంగల్ వంటి మహా నగరాలకు ఇసుకను రవాణా చేసే లారీ యజమానులు గురువారం జిల్లా కేంద్రంలో లారీలను ఎక్కడిక్కడ నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రవాణా బంద్ను పాటించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో లారీలు నడపడం కష్టంగా మారింది. యజమానులు నెల నెలా జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడుతలేదు. లారీ నడిపితేనే కుటుంబం గడుస్తుంది. పెరిగిన ధరలతో ఎం కొనలేని పరిస్థితి. మా లాంటి డ్రైవర్లతో పాటు సామాన్య ప్రజలు దేశంలో బతకలేని పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైన ధరలు తగ్గించాలి.
– పల్లె నగేశ్గౌడ్, లారీ డ్రైవర్-హైదరాబాద్
డీజిల్ ధరలు పెంచడం వల్ల కిరాయిలు గిట్టుబా టు కావడంలేదు. లారీలను నమ్ముకొని జీవిస్తు న్న ఓనర్లకు అప్పులు పెరిగిపోతున్నాయి. ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతు న్నాం. పెంచిన పెట్రోల్ డిజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. లేకపోతే ఖర్చులు పెరిగి లారీల నిర్వహణ భారం అవుతుంది.
– వేములపల్లి రాజు, ములుగు జిల్లా
లారీ అసోసియేషన్ కోశాధికారి
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ల ధరలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జిల్లా కేంద్రం లోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మలుగు నుంచి గట్టమ్మ వరకు లారీలను నిలిపివేసి రవాణా బంద్ పాటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కోశాధికారి వేములపల్లి రాజు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్య ప్రజలు బతకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ సేఫ్టీ బిల్లు 2019ను రద్దు చేయడంతో పాటు ఫిట్నెస్ చార్జీలు, వాహనాల లైఫ్ ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలతో వాహనాలను నడపలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు వెంటనే తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.