పైరవీలు.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండానే స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సర్కారీ కొలువులు దక్కాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీచేయగా, ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి అవకాశాలు లభించాయి. ముఖ్యంగా నీటిపారుదల, పోలీస్, విద్య, వైద్య, వ్యవసాయ శాఖలతో పాటు గ్రూప్స్ ద్వారా అనేక ఉద్యోగాలు దక్కగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నిండాయి. రెక్కల కష్టంతో పిల్లలను చదివించిన తల్లిదండ్రులకు, కొలువులతో బీఆర్ఎస్ సర్కారు చేయూతనందించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు, నౌకర్లు పొందినవారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన నియామకాల ప్రక్రియ వల్లే తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దేవరుప్పుల : మిగతా రాష్ర్టాలతో పోల్చితే మన తెలంగాణలో యువతకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పట్టుదలతో వాటిని అందిపుచ్చుకోవాలి. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ, పైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయ. నేను బీటెక్ పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అన్ని పోస్టులకు అప్లయ్ చేసిన. మొదట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చింది, కానీ చేయలేదు. రెండోసారి పంచాయతీ కార్యదర్శి జాబ్ వస్తే ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చింది. కానీ ఎస్సై కావాలనుకున్నా. పట్టుదలతో పరీక్ష రాసి జాబ్ కొట్టాను. ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో చేస్తున్నా. వీటి మధ్యలో సింగరేణిలో ఉద్యోగం కూడా వచ్చింది. మా నాన్న చాలా కష్టపడి చదివించిండు. అందుకు ఫలితం దక్కింది. చాలా సంతృప్తిగా ఉంది. ఇదంతా కేసీఆర్ సర్కారు వల్లే సాధ్యమైంది. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఉద్యోగాలు మన దగ్గరికే రావు కదా.
వరంగల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కారు కల్పించిన అవకాశాలతో ఉమ్మడి జిల్లాలో వేలాది మంది యువత కొలువులు కొట్టి తమ కుటుంబాలను నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ఐటీ లాంటి సెక్టార్లలోనూ భారీగా నౌకరీలు దక్కడంతో జీవితాలకు బంగారు బాటలు వేసుకున్నారు. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసింది. వైద్యశాఖలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీస్ శాఖలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, నీటి పారుదల శాఖలో ఇంజినీర్ల నియామకాలు, వ్యవసాయ శాఖలోనూ పెద్ద సంఖ్యలో అవకాశాలు ఇచ్చింది. ఇటు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ద్వారా వేలాది ఉద్యోగాలు మన యువతకు దక్కాయి. చిన్న పైరవీ లేకుండా నయాపైసా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలకు ఎంతో ఊరటనిచ్చింది. మారుమూల గిరిజన గూడేల బిడ్డలకు సైతం సర్కారు నౌకర్లు దక్కాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా నియామకాలు జరిగిన సందర్భాలు లేనే లేవని, అటు తల్లిదండ్రులు, ఇటు నౌకరీ సాధించనవారు స్పష్టం చేస్తున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడుకు పైగా ఉద్యోగాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. జిల్లాల విభజనతో కొత్త ఉద్యోగులు ఆవశ్యకత ఏర్పడింది. పలు నోటిఫికేషన్ల ద్వారా వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడంతో యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి తప్పింది. గ్రూప్-2, 4, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగ నోటిఫికేషన్లతో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. పోలీస్శాఖలో పెద్దమొత్తంలో పోస్టులు భర్తీ అయ్యాయి. పలు కార్పొరేట్ కంపెనీలు సైతం జాబ్మేళాలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేక కోచింగ్ ఇప్పించి, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించారు. మున్ముందు మరిన్ని పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : మాది చాలా పేద కుటుంబం. నా భర్త శంకర్ పన్నెండేళ్ల కిందనే చనిపోయిండు. నాకు ఇద్దరు కొడుకులు. కైకిలి పనికి పోయి ఇద్దరు కొడుకులను సాదుకున్న. పైసలు లేక సర్కారు బడిలనే సదివించిన. పెద్దోడు కిరణ్ ప్రైవేట్ కాలేజీల చదువు చెప్తడు. చిన్నోడు గోపి మొదట్ల కానిస్టేబుల్ పరీక్ష రాత్తె కానిస్టేబుల్ కొలువు వచ్చింది. తర్వాత మళ్లోసారి పరీక్ష రాసిండు. పంచాయతీ కార్యదర్శి నౌకరి వచ్చింది. పోలీసు నౌకరి వద్దని ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి పని చేత్తాండు. గణపురం దగ్గర మైలారంల నౌకరి. లంచాలు పెట్టుడైతే మాతోని కాకపోవు. కేసీఆర్ సర్కార్ల లంచాలు లేకుండానే కొలువు అచ్చింది. నౌకరి వచ్చే దాక పెండ్లి చేసుకోను అన్నడు. ఇప్పుడేమో ఎస్సై అయ్యేదాక పెండ్లి చేసుకోను అంటాండు. చిన్నోనికి నౌకరి అచ్చినంక మా కష్టాలు తీరినయ్.
దంతాలపల్లి, అక్టోబర్ 31 : నా పేరు తండ ఉప్పలయ్య, మాది దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నాడు. మాది మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా కొడుకు చదువుకుంట 2020-21లో కానిస్టేబుల్ కొలువుకు పరీక్ష రాసిండు. వచ్చిన మార్కుల ప్రకారం నా కొడుక్కు ఎసొంటి పైరవీ, లంచం లేకుంటనే కొలువు వచ్చింది. ఇప్పుడు మంచిగ ఉద్యోగం చేస్తున్నడు. మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నం. ఇదివరకు ఉద్యోగం రావాలంటే లంచం పెట్టి నాయకులతో పైరవీ చేసుకుంటేనే ఉద్యోగం వచ్చేది. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉద్యోగలకు ఎలాంటి పైరవీలు, లంచం లేకుండా ఉద్యోగాలు వస్తున్నయ్. నా పెద్ద బిడ్డ ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కోసం లంచం ఇయ్యలేక పెళ్లి చేశాను. కేసీఆర్ సారు వచ్చినంక పైరవీలు లేకుంటనే కొలువులు రావడం వల్ల పేద కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి.
సంగెం, అక్టోబర్ 31 : కష్టపడి చదివన నాలాంటి పేదవాడికి పైసా ఖర్చులేకుండా ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన అవకాశంతో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. పట్టుదలతో చదువుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. ఉద్యోగం వచ్చిన ఈ సందర్భంలో మా నాన్న ఉండి ఉంటే ఎంతో సంబురపడేవాడు. జన్మనిచ్చిన తల్లితండ్రులను, ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరచిపోను. ఈ ఉద్యోగం చేసుకుంటూ మరో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా.
దేవరుప్పుల, అక్టోబర్ 31 : మాది పేద వ్యవసాయ కుటుంబం. కాయకష్టం చేసి బతికే కుటుంబం. నాడు ఎవుసానికి నీళ్లు లేక సావు సచ్చేది. బిందె పట్టుకొని వ్యవసాయ బావుల కాడికి నీళ్ల కోసం పోతె ఎల్లగొట్టేది. తెలంగాణ వచ్చినంక సౌలతులు పెరిగినయ్. తండ్రి ఇచ్చిన రెండెకాలను ఇవాళ ఎనిమిది ఎకరాలు చేసినం. మేకల పెంపకం, వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు బోర్లు ఫుల్లు పోస్తున్నయ్, తాగే నీళ్లు ఇంట్లకే వస్తున్నయ్. ఇద్దరు బిడ్డలు చంద్రకళ, లలితలను డిగ్రీ చదివించి పెళ్లి చేసినం. కొడుకు రమేశ్ బీటెక్ పూర్తి చేసి తెలంగాణ గవర్నమెంట్ల ఐదు నౌకర్లు కొట్టిండు. ఇప్పుడు ఖమ్మంల ఎస్సైగా పనిచేస్తుండు. కొడుకు కొలువు రావడం గర్వంగా ఉంది. కోడలుకు పెళ్లికాంగనే కానిస్టేబుల్ నౌకరి వచ్చింది. బిడ్డలు మంచిగ బతుకుతున్నరు. నా కొడుకు చెల్లెళ్లను మంచిగ చూసుకుంటడు. ఇంకేం కావాలె.
ములుగు, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : మాది ములుగు మండలం దేవగిరిపట్నం. నేను గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేసిన. నా భర్త ప్రైవేట్ డ్రైవర్. నేను ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తున్నా. మాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కూతురు ప్రవళిక బీఎంఎస్ సెకండియర్ చదువుతోంది. కొడుకు ప్రవీణ్ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసిండు. 2019లో ఎస్సై పోస్టుకు రాసి సెలెక్టు అయ్యిండు. ఏ కోచింగ్కు పోలేదు. ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాడు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు జనగామ జిల్లా లింగాలఘనపురంలో ఎస్సైగా పనిచేస్తున్నడు. నౌకరి వచ్చిన తర్వాత పెండ్లి చేసిన. సీఎం కేసీఆర్ పాలన చాలా బాగుంది.
చెన్నారావుపేట, అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్రంలో మా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సాధించిన ఆ కొలువే మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది. మాది చెన్నారావుపేట మండలం ఈర్యతండా. మాకు నలుగురు పిల్లలు. ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరి బిడ్డల పెళ్లి చేశాం. పెద్ద కొడుకు రాజు ఇంజనీరింగ్ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డడు. తెలంగాణ రాష్ట్రంలో 2017లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం కూడా చాలా కష్టపడి చదివిండు. కానీ కొద్ది మార్కుల తేడాతో రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నో ఉద్యోగాలకు పరీక్షలు పెట్టింది. అందులో నా కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడంతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇదంతా తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే అయింది. అంతకుముందు సర్కారీ కొలువుల కోసం చాలామంది యువకులు కష్టపడి చదివినా ఉద్యోగాలు రాకపోయేది. చాలామంది యువకులు చదువు బంద్చేసి వ్యవసాయం, సొంత వ్యాపారం చేసుకునేవాళ్లు ఉన్నారు. సీఎం కేసీఆర్ యువకులకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించిండు.