వరంగల్, మే 13(నమస్తేతెలంగాణ) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి తెచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. ఈమేరకు పాఠశాలలన్నింటినీ మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నది. తొలివిడుత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసింది. అవసరమైన నిధులు కేటాయించింది. పనులు చేసే ఏ జెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రతి జి ల్లాకు రూ.2 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం నుం చి మార్గదర్శకాలు జారీ కావడంతో అధికారులు మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు ప్రణాళిక రూ పొందించారు. తొలి విడుత ప్రభుత్వం జిల్లాలో 223 పాఠశాలలను సెలక్ట్ చేసింది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 123, ప్రాథమికోన్నత పాఠశాలలు 20, ఉన్న త పాఠశాలలు 80 ఉన్నాయి. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు మండలానికో ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాన్ని కలెక్టర్ కేటాయించారు.
మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయా మండలానికి కేటాయించిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో పన్నెండు అంశాలపై అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గ్రీన్సిగ్నల్ రాగానే యుద్ధప్రాతిపదికన ఎస్టిమేట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. అంచనాల తయారీ చివరి దశకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్టిమేట్స్కు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకుంటున్నారు. గురువారం వరకు 96 పాఠశాలలకు రూ.19,15,86,741 అంచనా వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ పొందారు. మరో 36 స్కూళ్లకు సంబంధించి ఎస్టిమేట్స్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా 91 పాఠశాలల ఎస్టిమేట్స్ వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనులు షురూ..
మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు తొలివిడుత ఎంపిక చేసిన స్కూళ్లలో చేపట్టే అభివృద్ధి పనులను వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన సెలక్ట్ చేసిన పాఠశాలల్లో జూన్ 12వ తేదీలోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో అధికారులు పాలనాపరమైన అనుమతులు పొందిన పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంపై దృష్టి సారించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గత ఏప్రిల్ 15న రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించి జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలును షురూ చేశారు. తర్వాత అధికారులు ఇతర పాఠశాలల్లో మొదలు పెడుతున్నారు. గురువారం ఒకేరోజు నాలుగు పాఠశాలల్లో పనులను ప్రారంభించారు.
వీటిలో గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట మండలాల్లోని మొగిలిచర్ల, మనుగొండ, సంగెం, షాపూర్, చెన్నారావుపేట స్కూళ్లు ఉన్నాయి. చెన్నారావుపేట స్కూల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ పొందిన ఇతర పాఠశాలల్లో కూడా సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
రూ.30 లక్షల్లోపు పనులు ఎస్ఎంసీలకు..
మన ఊరు-మన బడి కార్యక్రమం అమల్లో భాగంగా అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.30 లక్షల్లోపు పనులను ఎస్ఎంసీలకు కేటాయిస్తున్నారు. ఎస్ఎంసీలు అగ్రిమెంట్ పనులు చేపడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో పాలనాపరమైన అనుమతులు లభించిన 96 స్కూళ్లలో 85 పాఠశాలలు రూ.30 లక్షల్లోపువి ఉంటే, 11 స్కూళ్లు మాత్రమే రూ.30 లక్షలకుపైగా అంచనా వ్యయంతో కూడినవి ఉన్నాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులు టెండర్లు నిర్వహించారు.
ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం మొదట ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు(హెచ్ఎం), స్థానిక సర్పంచ్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేర అధికారులు బ్యాంకు ఖాతాలు తెరిచారు. తాజా నిబంధనల ప్రకారం ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎంకు మాత్రమే చెక్ పవర్ ఉంటుంది. లావాదేవీలను వీరిరువురే నిర్వహిస్తారు. అభివృద్ధి పనులు చేపట్టే పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సందర్శించి అవసరాలు, ఎస్టిమేట్స్ పరిశీలిస్తున్నారు. ఆమె పర్యవేక్షిస్తుండగా విద్యాశాఖ జిల్లా ప్లానింగ్ సెక్టోరియల్ అధికారి సుధీర్బాబు ఈ కార్యక్రమ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ బీ గోపి మన ఊరు-మన బడి పనుల పురోగతిపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు.