తొర్రూరు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. తొర్రూరులో సభలో ఆమె మాట్లాడుతూ వేల కోట్లు సంపాదించి ఎన్నికల సమయంలో సీట్లు కొనుక్కుని వచ్చే కాంగ్రెస్ ప్యారాచూట్ లీడర్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఓడిపోగానే మళ్లీ కంటికి కనిపించని వారిని నమ్మకూడదని కోరారు.
ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన పాలకుర్తి బిడ్డలు మళ్లీ దయాకర్రావును గెలిపిస్తేనే అభివృద్ధి నిరంతరంగా సాగుతుందని, ఈ రోజు మన పల్లెలు, తండాలు బాగుపడ్డాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమేనని పదేళ్లుగా తెలంగాణను దేశంలోనే ఆగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఈ ఉత్సాహాన్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఓట్ల రూపంలో బీఆర్ఎస్ను అక్కున చేర్చుకుని ఆదరించాలని సత్యవతి విజ్ఞప్తిచేశారు.