మక్తల్ : పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసా కు భరోసాగా నిలిచిన కల్యాణ లక్ష్మి ( Kalyana Lakshmi ) , షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) అన్నారు. బీఆర్ఎస్ మక్తల్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 167 అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
ఆడబిడ్డ పెళ్లికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారంగా కల్యాణ లక్ష్మి పథకం తోపాటు తులం బంగారం ( Tula Gold ) అడుగుతున్నరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆడపిల్ల పెళ్లి అయినా రెండు నెలలకే, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం నుంచి ఆర్థిక సహాయం అందిందని గుర్తు చేశారు.
కేసీఆర్ హాయంలో సుమారు 13 లక్షల మంది ఆడ బిడ్డల కుటుంబాలకు 13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని గుర్తు చేశారు. హైకోర్టు కళ్యాణ లక్ష్మి పథకంపై నాలుగు దఫాలుగా గడువు ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.కేసీఆర్ ప్రారంభించిన పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఉద్యమాలు చేస్తామని చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.
ధర్నాలో సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మక్తల్ ,మాగనూర్, ఉట్కూర్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు చిన్న హనుమంతు, సర్పంచులు శ్రావణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ గౌడ్, నాయకులు అన్వర్ హుస్సేన్, మొగులప్ప, నరసింహారెడ్డి, రామలింగం, జుట్ల సాగర్, రాజు, అమ్రేష్, సాదిక్, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, బాలప్ప, ఆనంద్, ఆంజనేయులు, నాయకులు తదితరులు ఉన్నారు.