మహబూబాబాద్ : మహబూబాబాద్ నుంచి మరోసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత(Maloth Kavitha) కోరారు. పోటికి అవకాశం కల్పించిన అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR )కు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో డోర్నకల్ (Dornakal) నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల సన్నాహక సమావేశాలు తన సొంత ప్రాంతమైన డోర్నకల్ నుంచి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా కార్యాచరణతో ముందుకు వెళ్దామని, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తానే తీసుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోతుందని పేర్కొన్నారు. తాగు, సాగు నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుడిపుడి నవీన్ రావు పాల్గొన్నారు.