ముంబై: ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు, ప్రభుత్వ ఉన్నతాధికారి కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు రెండు రోజుల పాటు దారుణంగా హింసించాడు. బాలిక మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు. (Girl Raped By Friend) మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. ఒక ఉన్నతాధికారికి చెందిన 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. ఇన్స్టాగ్రామ్లో 20 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్తో పాటు స్నాప్చాట్, గేమింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా వారిద్దరూ కమ్యూనికేట్ అయ్యేవారు.
కాగా, ఆగస్ట్ 2న స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్తో కలిసి మాల్కు వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు చెప్పి ఆ బాలిక బయటకు వెళ్లింది. కుమార్తె ఎంతకీ తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందారు. ఆమె స్నేహితులను ఆరా తీయగా ఎవరినీ కలవలేదని తెలుసుకున్నారు. దీంతో పోలీసులను కలిసి మిస్సింగ్ కంప్లైట్ ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ బాలిక కాల్ రికార్డ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఫ్రెండ్ను మహారాష్ట్రలోని థానేకు చెందిన నిర్భయ్ అలియాస్ ఆకాష్ మాధవ్ పఖ్రేగా గుర్తించారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతూ నాగపూర్లోని అద్దె ఇంట్లో అతడు నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ యువకుడి తల్లి ప్రముఖ వైద్యురాలని, అతడి బంధువు ఒకరు సీనియర్ ఐపీఎస్ అధికారి అని సమాచారం.
కాగా, నిర్భయ్ అలియాస్ ఆకాష్ ఆ బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానించారు. అతడి ఫోన్ నంబర్ సేకరించి కుటుంబాన్ని సంప్రదించారు. థానే పోలీసులు ఆ యువకుడి ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. కుమారుడికి ఫోన్ చేయమని అతడి తల్లిని కోరారు. అయితే పోలీసు అధికారి తన తల్లితో మాట్లాడుతున్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి అంతా బాగానే ఉందని చెప్పమని ఆ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు. బాలిక తన పేరెంట్స్కు కాల్ చేయడంతో వారిద్దరూ ఉన్న ప్రదేశాన్ని పోలీసులు ట్రేస్ చేశారు. ఆగస్ట్ 4న నిందితుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా ఆ డెలివరీ బాయ్తో కలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మరోవైపు నగ్నంగా ఉన్న బాలికను గదిలోని బెడ్కు నిందితుడు కట్టేసి ఉండటాన్ని కిటికీ నుంచి తాము చూసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడి చేతిలో కత్తి కనిపించిందని, బాలిక శరీరంపై కోసిన గాయాలున్నాయని చెప్పారు. ఆమె మణికట్టు తెగి ఉందన్నారు. డోర్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి ఆ బాలికను రక్షించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరికొంత సేపు ఆలస్యం జరిగి ఉంటే నిందితుడు ఆ అమ్మాయిని చంపేసేవాడని అన్నారు.
ఆ బాలికపై రెండు రోజుల పాటు లైంగిక, శారీరక వేధింపులు జరిగినట్లు పోలీసులు ఆరోపించారు. నిందితుడు ఆ బాలిక అశ్లీల ఫొటోలు తీసి, వాటిని వైరల్ చేస్తానని, ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడిపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నంతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఈ కేసులో ఇతర అనుమానితులు ఉన్నారా? నిందితుడు గతంలో ఇతర బాలికలపై లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధితురాలిని హింసించడానికి నిందితుడు ఉపయోగించిన కత్తి, ఇతర నేరారోపణ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తీవ్రమైన మానసిక వేదనకు గురైన బాధితురాలికి వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వివరించారు.
అయితే ఆ బాలిక, యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నదని నిందితుడి తరఫు న్యాయవాది ఆరోపించారు. కిడ్నాప్ జరుగలేదని, ఆ బాలిక తన స్వేచ్ఛతోనే అతడి రూమ్కు రహస్యంగా వెళ్లిందని చెప్పారు. ఆ అమ్మాయి తన చేతిని తానే కోసుకుందని ఆ న్యాయవాది వాదించారు.