మహబూబాబాద్ రూరల్,నవంబర్ 25:విద్యార్థులు మెదడుకు పదును పెట్టి రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. నిత్యం మనకు ఉపయోగపడేవే గాక రైతుకు సాగు పనులు సులభతరం చేసే వివిధ ప్రయోగ పరికరాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ గురుకులంలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన 79 ఎగ్జిబిట్లను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి, విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణల వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 25 : పాఠశాల విద్యార్థి దశ నుంచే పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల దశలో విద్యార్థులకు సైన్స్ఫేర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి మంచి ఆవిష్కరణలు చేశారని, ఆయన గొప్పతనం వల్లే భారత రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. పాఠశాల దశలోనే ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘మన ఊరు-మన బడి’ ద్వారా పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.
నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన, మంచి పౌష్టికాహారం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, విద్యాభివృద్ధి పథకాలు వంటి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులతో పాటు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించడం వల్లే నేడు ప్రభుత్వ విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశం పొందడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేసి ప్రవేశాల సంఖ్య పెంచాలన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పూర్తిగా సమసిపోయి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలుండడం వల్ల నేడు ప్రైవే ట్ నుంచి సర్కారు బడిలో చేరుతున్నారన్నారు. విద్యార్థులు సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల గ్రౌండ్ను అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడు తూ దేశంలోని మహానుభావులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు.
నేడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులున్నాయని, పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చదువుకునే రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవని, అయినా పట్టుదలతో చదివి గొప్పవారయ్యారని.. సమయం వృథా చేయకుండా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత మానుకో ట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లను మంత్రి సత్యవతి అభినందించా రు. 180మంది విద్యార్థులు 79 ఎగ్జిబిట్లను రూపొందించా రు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ హై, ప్రిన్సిపాల్ రూపాదేవి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంకా బద్రీనారాయణ , వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రెండో రోజూ ఉత్సాహంగా..
మడికొండలో కొనసాగుతున్న జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటున్న ఎగ్జిబిట్లు.. ఇతర స్కూళ్ల విద్యార్థుల సందర్శన
మడికొండ, నవంబర్ 25: మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో రెండో రోజూ జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఉత్సాహంగా కొనసాగింది. శుక్రవారం ప్రదర్శనలను తిలకించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి ఎగ్జిబిట్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. వరంగల్ , భూపాలపల్లి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యాథ్స్, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆర్ట్స్ అండ్ లిటరేచర్లో ఒక్కో అంశానికి నలుగురు చొప్పున 20 మంది న్యాయనిర్ణేతులుగా నియమించినట్లు ఆర్సీవో విద్యారాణి తెలిపారు. వీరు ప్రతి ఎగ్జిబిట్ను పరిశీలించి విద్యార్థులతో ఆయా అంశాలకు సంబంధించి చర్చిస్తారు. ఒక్కో అంశం నుంచి ప్రథమ స్థానంలో నిలిచిన ఐదుగురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యం, నిట్ ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ సందర్శించి విద్యార్థులను అభినందించారు.
మెటల్ డిటెక్టర్
ఈ డిటెక్టర్ సెన్సార్ సాయంతో మెటల్స్ని డిటెక్ట్ చేసి బజర్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీనివల్ల బాంబులు, ల్యాండ్ లైన్స్, మందుపాతరలు ఉన్న ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. దీని సామర్థ్యం పెంచినట్లయితే ఉక్కు గనులను కూడా కనుకోవచ్చు. వీటిని పరిశ్రమలు, ఎయిర్ పోర్టులు, షాపింగ్ మాల్స్, రైల్వే లైన్ క్రాక్స్, పబ్లిక్ ప్రదర్శనలో భద్రత కోసం వినియోగించవచ్చు.
– విద్యార్థులు: చరణ్య, అక్షిత, గైడ్ టీచర్: చంద్రశేఖర్
వ్యర్థాలతో విద్యుత్
వ్యర్థాలను వేరుచేసి మిగిలిన నీటిని వేరొక ట్యాంకులోకి పంపిస్తే సాలిడ్ వంటి స్లడ్జ్ కిందికి చేరు తుంది. దీన్ని మరొక ట్యాంక్లోకి పంపించడం వల్ల గోబర్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీంతో తయారైన విద్యుత్ను ఇంటికి వాడుకోవచ్చు. అదేవిధంగా డంపింగ్ యార్డులో నిల్వచేసిన ప్లాస్టిక్ వ్యర్థ్ధాలను రీసైక్లింగ్ యూనిట్కి పంపించి క్రషర్ చేస్తారు. దీన్ని మిక్చర్ మిషన్లో పెట్రోలియం ప్రొడక్టు, కాంక్రీట్ను కలిసి రహదారులను నిర్మించవచ్చు.
విద్యార్థులు: వీ అర్జున్, జీ కృష్ణతేజ,
గైడ్ టీచర్: సుమన్, కోహెడ, సిద్దిపేట
ప్రకృతి వైపరీత్యాలు తెలుసుకోవచ్చు
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ పరికరంతో ముందుగానే తెలుసుకోవచ్చు. భూకంపం వచ్చే ముందే ఇందులో ఉండే అలారం మోగుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా నివారించవచ్చు. వరదలు, అగ్ని పర్వతాలు, కొండచరియలు విరిగిపోవడం నుంచి జీవావరణాన్ని రక్షించడం కోసం ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు: వర్షిణి, హర్షవర్దిని, గైడ్ టీచర్: శారద, ఆత్మకూరు, వరంగల్
డ్రోన్స్తో మందుల పిచికారీ
– ఎం.మణికంఠ, సాయిభరత్(కృష్ణవేణి స్కూల్), గైడ్ టీచర్ ఉపేంద్రమ్మ
డ్రోన్ల ద్వారా రైతులు తమ పొలాలకు పెస్టిసైడ్ పిచికారీ చేయవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల కూలీల అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. రిమోట్ కంట్రోల్తో పురుగు మందులు కొట్టడం వల్ల పని త్వరగా పూర్తవుతుంది. అంతేగాక రైతు నేరుగా పిచికారీ చేయకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధుల సమస్య కూడా ఉండదు. ఈ డ్రోన్ను 5 స్కై మోటర్, 2 మదర్ బోర్డ్స్, 6 బ్యాటరీలు, చిన్న వాటర్ పైపులు, వైర్తో చాలా సులభంగా డ్రోన్ను తయారుచేసుకోవచ్చు.
మిరప ఏరేందుకు మొబైల్షెడ్
– మంజుల, గైడ్ టీచర్ ఝాన్సీ, పెద్దనాగా రం, ప్రభుత్వ పాఠశాల నర్సింహులపేట
మిరప పంట ఎక్కువగా ఎండాకాలంలోనే చేతికొస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు కూలీల కొరత బాగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మొబైల్షెడ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంత ఎండకొట్టినా కూలీలు లేకుండా వడదెబ్బ తగలకుండా కాయలు త్వరగా ఏరవచ్చు. ఈ మొబైల్షెడ్ ద్వారా మిరప పంటనే కాకుండా వాటర్ సదుపాయం, మిర్చిని బస్తాల్లోకి నింపేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇది కేవలం మిరపకే కాకుండా పల్లికాయలను మిగతా అన్ని రకాల పంటలకు సైతం ఈ మొబైల్ షెడ్ ఎంతో ఉపయోకరం. వీటిని అట్టముక్కలు, లేదా చెక్కల ద్వారా ఈజీగా తయారుచేసుకోవచ్చు.
సులభంగా ఇంటిని శుభ్రం చేసే పరికరం
ఇంట్లో పట్టిన బూజును, చెత్తను సులభంగా క్లీన్ చేయవచ్చు. ఈ పరికరం ద్వారా ఇంట్లో ఉండే వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు సైతం దీనిని వాడొచ్చు. పరికరం ద్వారా సమయం ఆదా అయి ఈజీగా పని పూర్తి అవుతుంది. ఇది ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉండే వారికి సులువుగా ఉంటుంది. దీనిని రెండు ఇనుపరాడ్లు, ఒక డీసీ మోటర్, ఒక స్విచ్తో తయారుచేసి వినియోగించవచ్చు.
– ఎం.చరణ్, గైడ్ టీచర్ మాధవి, ప్రభుత్వ పాఠశాల, మహబూబాబాద్