కోదాడ, ఆగస్టు 15 : తమ ఉద్యోగాలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించగా, ఆమె కూతురు అక్కడే నిరసనకు దిగిన ఘటన కోదాడలో శనివారం చోటుచేసుకుంది. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కోదాడ మున్సిపాలిటీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరైన తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పులి రత్నమ్మ అనే మహిళ తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. తాను మున్సిపాలిటీలో ఉద్యోగం చేసేందుకు పూర్తి అర్హురాలినని, అయితే ఇప్పుడు తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించేందుకు సమాయత్తమైంది.

ఉద్యోగాలు తొలగించడంపై తల్లీకూతురు నిరసన
అయితే సమస్య వివరించేందుకు క్యాంప్ కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయారు. దీంతో తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే సమయంలో రత్నమ్మ కూతురు పులి జ్యోతి కూడా తన తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని, సంవత్సరాల తరబడి ఇక్కడే పని చేస్తున్నానని అయినప్పటికీ జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన తల్లికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ జీవనాధారమైన ఉద్యోగాలను ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కాగా రత్తమ్మ అకస్మాత్తుగా పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం 108 అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.