ఖమ్మం కమాన్బజార్, సెప్టెంబర్ 16: ‘45 ఏండ్ల క్రితం జీవో 58 ప్రకారం ప్రభుత్వమిచ్చిన జాగలోనే ఇండ్లు కట్టుకొని బతుకీడుస్తున్నం. రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పుడు ఇండ్లు కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి? ఎలా బతుకాలి?’ అని ఖమ్మంలోని శ్రీనివాసనగర్ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తున్నందున ఇండ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీంతో నిరుపేదలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి అయ్యప్పటెంపుల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు.
నోటీసులిచ్చిన ఒక్క రోజులోనే ఖాళీ చేయాలనడంపై వారు భగ్గుమన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు పది రోజులు సమయం ఇస్తామని, ఆలోగా ఖాళీ చేయాలని సూచించారు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్ నిరుపేదల ఆందోళనకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మద్దతు ప్రకటించారు.