Priyank Kharge : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India’s 80th Independence Day) సందర్భంగా కర్ణాటక మంత్రి (Karnataka Minister), కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు..? అంటూ ఆయన ఆరెస్సెస్ను సూటిగా ప్రశ్నించారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన 500 మంది కాంగ్రెస్ నేతల పేర్లను తాను వెల్లడించగలనని, అదే రీతిలో ఆరెస్సెస్ నుంచి కనీసం 50 మంది పేర్లనైనా మీరు చెప్పగలరా..? అని ఖర్గే సవాల్ విసిరారు. దేశ విభజన అనంతరం చోటుచేసుకున్న మత ఘర్షణలకు ఆరెస్సెస్ కారణమని ఆయన ఆరోపించారు. ఆరెస్సెస్ రిజిస్ట్రేషన్ లేని సంస్థ అయినందున దానిని నిషేధించడం సాధ్యం కాదని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రాంగణాలు, బహిరంగ ప్రదేశాల వినియోగాన్ని నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లు నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, పార్కులలో నిర్వహించే ఆరెస్సెస్ శాఖలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకున్నది కాదని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలకు చట్టబద్ధత కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టంచేశారు.
‘మీ కార్యకలాపాలను మీ నివాసాల్లోనో లేదా కార్యాలయ ప్రాంగణాల్లోనో నిర్వహించుకోండి’ అని ఆయన సూచించారు. ఇదే క్రమంలో బీజేపీకి ‘ప్రియాంక్-ఫోబియా’ పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఘాటుగా స్పందించారు. లక్షలాది మంది నమ్మకంతోనే ఆరెస్సెస్ పనిచేస్తోందని, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని అన్నారు. దేశ విభజన సమయంలో హిందువులకు ఆరెస్సెస్ అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.