Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ఇండియాకు రానున్నారు. ఈ నెలలోనే ఆయన ఇండియాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని బంగ్లాదేశ్కు చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది. మీడియా కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారం ఇండియాలో పర్యటిస్తారు. ఆయన ఆగష్టు 20-25 తేదీల మధ్య ఇండియాలో పర్యటిస్తారు. వీటిలో కచ్చితమైన తేదీల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
ఆగష్టు 20, 21 తేదీల్లో లేదా ఆగష్టు 21, 22 తేదీల్లో ఆయన పర్యటన ఉండొచ్చు. ఈ పర్యటనలో రహమాన్.. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై దాడి విషయంలో ఆ దేశంపై ఇండియా ఆగ్రహంగా ఉంది. ఇదే సమయంలో తమ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లా వ్యతిరేకతతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగు కోసం బంగ్లా ప్రధాని పర్యటన కీలక కానుంది. ఆయన పర్యటన సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.
ప్రధానంగా షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే అంశంపై రహమాన్ చర్చించే అవకాశం ఉంది. అయితే, పర్యటన షెడ్యూల్, ముఖ్యాంశాలు వంటివి ఇంకా ఖరారు కాలేదు. ఇక.. రహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాలో పర్యటించనుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా ఇటీవలే బంగ్లా.. భారత్ను కోరింది.