మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో దాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….ధాన్యం కొనగోలు చేసే టప్పుడు మాన్యువల్ కాంటాలను వినియోగించవద్దని సూచించారు. జిల్లాలో 2 లక్షల 14 వేల 463 ఎకరాల్లో వరి పంట సాగు చేసినందున ధాన్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వరి పంట సాగును బట్టి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 231 నుంచి 235 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ఓ ట్యాబ్ ఇచ్చి అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా ప్రతి కొనుగోలు సెంటర్కు 30 టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో 2 మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని మొదట రిజిస్టర్లో నమోదు చేసి రైతులకు రిసిప్టులు ఇవ్వాలన్నారు. రవాణాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసుకోవాలన్నారు.
గన్నీ బ్యాగుల కొరత అసలు తలెత్తవద్దనివ్వదన్నారు. మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అదనపు కలెక్టర్కు తెలిపారు. లీగల్ మెట్రాలజీ అధికారులు వేయింగ్ బ్రిడ్జీలను చెక్ చేయాలన్నారు. ఈ సందర్భంగా దాన్యం కొనుగోలుపై ముద్రించిన వాల్పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ శశాంక, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, కొమురయ్య, డీఆర్డీవో పీడీ.సన్యాసయ్య, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం సివిల్ సైప్లెస్ అధికారి మహేందర్, వ్యవసాయాదికారి చత్రునాయక్, మార్కెటింగ్ అధికారి వెంకట్రెడ్డి, సహకార శాఖ అధికారి ఖుర్షిద్ పాల్గొన్నారు.