మహబూబాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం ఉంది. 56,690 హెక్టార్ల (1,41,691 ఎకరాలు)లో నిక్షిప్తమై ఉన్నట్లు సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే గుర్తించింది. ఇక్కడి ఇనుప ఖనిజం విలువ సుమారు రూ. 700 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ నిల్వల్లో 12 శాతం బయ్యారంలోనే ఉన్నట్లు నిర్ధారించింది. గూడూరు, భీమదేవరపల్లి, బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో లభించే ఇనుపరాయిలో బయ్యారానిదే అగ్రస్థానం. మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడే 80 శాతం ఎక్కువగా నిక్షిప్తమై ఉంది. గతంలో నిపుణుల కమిటీ కూడా ఇదే తేల్చింది. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తే నిరంతరాయంగా 30 ఏళ్లు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి ముడి ఖనిజం క్వాలిటీ లేకపోతే ఛత్తీస్గఢ్లోని బైలడిల్లా నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్రం వెనుకడుగు వేస్తూ వస్తున్నది.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావలసిన అన్ని వనరులు ఉన్నాయి. ఉక్కు కర్మాగారానికి నాలుగు టీఎంసీల నీరు అవసరం. సీతారామ ప్రాజెక్టులో భాగంగా బయ్యారం పెద్దచెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్గా మార్చితే ఏడాదంతా రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అనువైన స్థలం ఉంది. బయ్యారం మండలం ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని 452 సర్వే నంబర్లో 4వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కర్మాగారానికి 2200 ఎకరాలు మాత్రమే అవసరం. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే మార్గం పక్కనే ఉన్న గార్ల మండలంలో ఉంది. అయినా స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చి ఏడేళ్లుగా ప్రతిసారి బడ్జెట్లో మొండిచేయి చూపుతున్నది. ఏపీలోని విశాఖలో నీటి ఆధారంగా స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేసింది. అక్కడ సహజసిద్ధమైన అడవులు లేకపోయినా ప్లాంట్ ఏర్పాటుకు సాహసం చేసింది. అన్ని వనరులున్న బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే అంతకు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశమున్నా వెనకడుగు వేస్తున్నది. ఇక్కడి ఖనిజం నాణ్యత 45 ప్లస్ అని నిపుణులే తేల్చినప్పటికీ కేంద్రం వెనుకడుగు వేయడంపై ఏజెన్సీ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నాడు వలసపాలకుల కుట్రలకు బయ్యారం బలైంది. నేడు కేంద్ర ప్రభుత్వ వివక్షకు గురవుతూ వస్తున్నది.