మహబూబాబాద్ : గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు (Congress leaders) దౌర్జాన్యానికి పాల్పడ్డారు. జాతీయ జెండాను ఎగురవేస్తున్న కమిటీ నాయకులపై వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం ఘటన చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో హయాంలో 100 అడుగుల జాతీయ జెండా గద్దెను కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. గణతంత్య్ర, స్వాతంత్య్ర వేడుకల రోజున స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ తంతుగా మారింది.
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ లో జాతీయ జెండాను కమిటీ నిర్వాహకులు ఎగురవేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుని ప్రొటోకాల్ పాటించాలని, ఎమ్మెల్యేచేత ఆవిష్కరించాలని పట్టుబట్టారు. ఈ దశలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ సత్యనారాయణ ఇరువర్గాలను నచ్చజెప్పి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయునితో జెండాను ఆవిష్కరింప జేయడంతో పరిస్థితి సద్దుమణిగింది .