మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబయ్యాయి. నేటి(సోమవారం) నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండగా శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగనున్నాయి. ఈ సందర్భంగా హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, రామప్ప, కురవి వీరభద్రస్వామి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాలు సహా అన్ని శైవక్షేత్రాల్లో భక్తులకు సౌకర్యాలు, దర్శనం కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. భక్తుల కోసం ఆర్టీసీ ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అలాగే శివకల్యాణం, పట్నాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ సిద్ధం కాగా విద్యుత్ వెలుగుల్లో ఆలయాలు మెరిసిపోతున్నాయి. – నమస్తే నెట్వర్క్
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 27 : ఓరుగల్లు నగరంలో కైలాసగిరి సిద్ధమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరంలో ఉన్న కైలాసగిరి కంటే భిన్నం గా, పలు విశేషాలతో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేయనున్నాయి. దేశాయిపేట నుంచి పైడిపల్లి వెళ్లే దారిలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం ఆవరణలో కైలాసగిరి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఉన్న గుట్టలను తొలిచి, అందమైన ఆకృతిలో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఎత్తయిన గుట్టపై శివలింగం, పక్కనే 30 ఫీట్ల ఎత్తులో శివపార్వతుల విగ్రహాలను ఏపీ నుంచి వచ్చిన శిల్పులు చెక్కారు. వినాయక, కార్తికేయ, నంది విగ్రహాలు సైతం ఏర్పాటు చేశారు. వీటికి ముందు జలధారల కోనేరు, అందులో జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహం భక్తులకు దర్శనమిస్తాయి. వేలాది మంది భక్తులు కూర్చుని వీక్షించేలా రంగురంగుల లైటింగ్తో విశాలమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల కోర్కెలు తీర్చేందుకు శివుడి కుటుంబం భూలోకానికి వచ్చినట్లు తీర్చిదిద్దుతున్నారు. పార్వతీ పరమేశ్వరులతోపాటు ఎడమ వైపున విఘ్నేశ్వర, నవగ్రహ, పోచమ్మతల్లి ఆలయా లు సైతం ఏర్పాటవుతున్నాయి. నేడు సాయంత్రం కైలాసగిరి మేల్కొలుపు పేరుతో దేశాయిపేట కైలాసగిరి నుంచి పోచమ్మమైదాన్ వరకు వేలాది మంది శివభక్తులతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మార్చి 1న మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇక్కడి కైలాసగిరిపై ఉన్న శివ పార్వతుల వద్దకు వెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లు నిర్మించారు. ఇక్కడే భారీ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. కైలాసగిరి కొలను, ఆదిశంకరాచార్యులు, హనుమాన్, సూర్యదేవుడు, శ్రీరాముడి విగ్రహాలు, నాగమయ్య, పోచమ్మ ఆలయం, యాగశాల, శంకరుడి విగ్రహంపై నీటిధారలు పడేలా ఫౌంటేన్ నిర్మించారు. భక్తుల కోసం పలు సదుపాయాలు కల్పించినట్లు నిర్వాహకుడు వెంకటేశ్వర్లు చెప్పారు. షిర్డీ సాయిబాబా ఆలయ కమిటీ బాధ్యులు, దాతలు, నాగార్జున స్కూల్ పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27: చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 28న సుప్రభాతం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, రుద్రాభిషేకం, అగ్నిప్రతిష్ఠాపన, గణపతి నవగ్రహ రుద్రహవనం, చండీహోమం, మార్చి 1న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రాత్రి 7.45 గంటలకు రుద్రేశ్వరుడు, రుద్రేశ్వరీ దేవికి కల్యాణం, 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు జరుపనున్నారు. 2వ తేదీన పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుతో ఆధ్యాత్మిక ప్రవచనాలు, 3న రుద్రాభిషేకాలు, తీర్థప్రసాద వినియోగం, అన్నపూజ, అన్నప్రసాద వితరణ, మహాపూజ నిర్వహించనున్నారు. 4న మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చన, ఆంజనేయస్వామికి చందనోత్సవం, ఆకుపూజ, పూర్ణాహుతి, పండిత సత్కారం, మహాదాశీర్వచనం ఉంటుంది.
– ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యూలైన్లు సిద్ధమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు. ధర్మ, అభిషేక, వీఐపీ దర్శనం ఉంటుంది. ప్రముఖులు తూర్పు ద్వారం నుంచి వస్తారు. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.
మడికొండ, ఫిబ్రవరి 27 : మడికొండ మెట్టుగుట్టపై నేటి నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వాస్తుపూజ, హోమం, రుద్రహోమం, మూలమంత్ర పుష్పం, ప్రదోషకాల పూజ నిర్వహిస్తారు. సోమవారం ప్రాతఃకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నపూజ, రథాంగపూజ, రథాంగ హోమం, స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు స్వామివారి మేల్కొలుపు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. రాత్రి 8గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో 108 లీటర్ల ఆవు పాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మహానీరాజనం ఇస్తారు. ఆ తర్వాత అగ్నిగుండాలు వైభవంగా నిర్వహిస్తారు. బుధవారం నవగ్రహ హోమం, రుద్రహోమం, నీరాజన మంత్రపుష్పం, గురువారం రుద్ర సహిత చండీహోమం, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, త్రిశూలస్నానం, పవళింపు సేవ, పుష్పోత్సవం నిర్వహిస్తారు.
వెంకటాపూర్, ఫిబ్రవరి 27 : మండలంలోని రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు వైభవంగా జరగనున్నాయి. యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్నందున జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. క్యూలైన్లు, పార్కింగ్ స్థలంలో లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గణపతిపూజ, అఖండ దీపారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, ఋత్విక్కరణం, సామూహిక రుద్రాభిషేకాలు, రాత్రి 10 గంటలకు శివపార్వతుల కల్యాణం, 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, బుధవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, గణపతిపూజ, రుద్రాభిషేకం, వీరభద్రపల్లెరం, సాయంత్రం భద్రకాళీ పూజ, సహస్రనామార్చన, బలిహరణ, రాత్రి దీపోత్సవం, గురువారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండాల్లో నడవడం, 5గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, 6 గంటలకు నాగబలి, గెలుపు, ఆశీర్వచనం, ప్రసాద వినియోగం ఉంటాయి. మంగళవారం రాత్రి జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాళేశ్వరం, ఫిబ్రవరి 27 : మహా శివరాత్రికి కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శనం కోసం తరలిరానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. జాగారం ఉండే భక్తులకు కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నా రు. గోదావరి నది వద్ద చలువ పందిళ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. హనుమాన్ గుడి సమీప ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. అలాగే వీఐపీ పార్కింగ్ కోసం దేవస్థానం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కేటాయించారు. వికలాంగులకు నేరుగా నది వద్దే వాహన పార్కింగ్ ఏర్పాటుచేశారు.
వరంగల్, భూపాలపల్లి నుంచి వచ్చే వారు కాటారం మీదుగా 30 కి.మీ ప్రయాణిస్తే కాళేశ్వరం చేరుకోవచ్చు. మంథని నుంచి 70 కి.మీ, మంచిర్యాల జిల్లా నుంచి 60 కి.మీ ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు చెన్నూరు మీదుగా 30 కి.మీ దూరంలో ఉన్న ప్రాణహిత వంతెన మీదుగా కాళేశ్వరం రావచ్చు. ఛత్తీస్గఢ్ ప్రజలు 60 కి.మీ దూరంలో ఉన్న ఇంద్రావతి నదిపై ఉన్న వంతెన పై నుంచి చేరుకోవచ్చు. ఇక గోదావరి నదిపై వంతెన మీద నుంచి మహారాష్ట్ర, సిరోంచ నుంచి భక్తులు చేరుకుంటారు.
శివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి వచ్చే 2వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈవో ఎస్.మహేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణ వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు.
పాలకుర్తి, ఫిబ్రవరి 27: పాలకుర్తిలోని స్వయంభువు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం(క్షీరగిరి క్షేత్రం) ప్రసిద్ధ శైవక్షేత్రం. పక్కనున్న మరో గుహలో లక్ష్మీనరసింహస్వామి వెలిశారు. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా ఉన్నారు. మునులు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడి గుహల నుంచి ఓంకార నాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. కవి పాల్కురికి సోమనాథుడికి సోమేశ్వరుడు ఆరాధ్య దైవమని తెలుస్తోంది. ఈయన ఇంటిపేరే ఈ ప్రాంతానికి కాలక్రమంలో పాలకుర్తిగా పేరు వచ్చిందని భావిస్తారు. పూర్వం నుంచే సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామికి భక్తులు అర్చనలు, అభిషేకాలు చేసేవారు. కొబ్బరికాయ ముడుపు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. పుట్టిన పిల్లలకు స్వామి పేరు పెట్టుకుంటారు. పాలకుర్తి మండలంలో 70 శాతం మందికి సోమన్న పేర్లే ఉంటాయి. పరిశుభ్రత పాటించకుండా కొండకు వస్తే తేనెటీగలు వారి వెంటపడిన ఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి. కాగా, మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకుని తరిస్తుంటారు. ఇందుకు 3వేల చదరపు అడుగుల చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 28న గణపతిపూజ, ధ్వజారోహణ, మార్చి1వ తేదీన కల్యాణ మహోత్సవం, రాత్రి 8 గంటలకు లింగోద్భవకాలం, 2న రథోత్సవం, ఎడ్లబండ్లు తిరుగుట, 3న డోలారోహణం, వసంతోత్సవం, పుష్పయాగం, సదస్యం, పల్లకీసేవ, 4న స్వామివారి సేవ, మహా అన్నపూజ, అగ్నిగుండాలు ఉంటాయని ఆలయ ఈవో రజినీకుమారి తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా స్నానఘట్టాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాలతో కొండపైకి మిషన్ భగీరథ నీరు అందించే సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 27: మహా శివరాత్రి ఉత్సవాలకు కురవి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయం సిద్ధమైంది. నేడు అమ్మవారికి అలంకరణ, మార్చి 1న అభిషేకాలు, పూజలు, సాయంత్రం శివపార్వతుల కల్యాణం, 4న తెప్పోత్సవం, 6న రథోత్సవం,7న పూర్ణాహుతి, 8న వసంతోత్సవం, నాగబెల్లి, 9న పల్లకీ సేవ, 14న ప్రత్యేకాలంకరణ, 15న పదహారు రోజుల పండుగ కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. భక్తులకు అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు.