న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశం నేపథ్యంలో ఆ కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు జైలుశిక్ష, జరిమానా విషయాల్లోనూ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో పేపర్ లీకేజీ(Paper Leaks) కేసులన్నీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్టు కింద పరిష్కరించే వారు. అయితే ఇప్పుడు ఆ చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం మూడు నెలల్లో తమ తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. పేపర్ లీకేజీలకు పాల్పడినవారికి శిక్షను ఖరారు చేస్తారు. పేపర్ లీక్లకు పాల్పడిన వ్యక్తులకు పదేళ్ల జైలుశిక్ష, పది కోట్ల జరిమానా విధించేందుకు చట్టంలో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం చట్టాల ప్రకారం పేపర్ లీకేజీ నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష ఉన్నది. ఒకవేళ దోషిగా తేలితే పది లక్షల జరిమానా కూడా విధించేవారు. నేరానికి చెందిన విషయాన్ని దాచిపెట్టే సర్వీస్ ప్రొవైడర్లకు కోటి జరిమానా విధిస్తున్నారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే, అప్పుడు నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష పడనున్నది. కోటి జరిమానా కట్టేవారు.
సవరణలు చేసిన బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపితే, ఆ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 150 పేపర్లు లీకేజీ అయినట్లు బుధవారం రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే.