హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19: ప్రతి వ్యక్తి కెరీర్ నిర్మాణంలో నైపుణ్యాలు, డిగ్రీలు ‘సాఫ్ట్వేర్’ అయితే.. నిజాయితీ, విశ్వసనీయత ‘హార్డ్వేర్’ వంటివని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 24వ స్నాతకోత్సవం తొలిరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. వ్యక్తిత్వమే భవిష్యత్ను నిర్ణయిస్తుందని సూచించారు.
వరంగ్ నిట్లో 24వ స్నాతకోత్సవం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో వైభవంగా జరుగుతోంది. రెండురోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన శనివారం930 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. రెండో రోజైన ఆదివారం (సెప్టెంబర్ 20న) పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. తొలిరోజు కార్యక్రమానికి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్కుమార్ ముఖ్య అతిథిగా, ఎన్ఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి గౌరవ అతిథిగా, ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది స్వాగత ప్రసంగం, స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. అనంతరం చైర్ పర్సన్, ముఖ్య అతిథి ప్రసంగాలు, గౌరవ డిగ్రీల ప్రదానం, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీల ప్రదానం, పతకాలు అవార్డుల ప్రదానం చేశారు.
ముఖ్య అతిథి సంతోష్కుమార్ మాట్లాడుతూ.. టెక్నికల్ నైపుణ్యాలు, డిగ్రీలు, రెజ్యూమ్ ఒక వ్యక్తి కెరీర్కు అవసరమైన ‘సాఫ్ట్వేర్’ అయితే, వ్యక్తిత్వం, నిజాయితీ, విశ్వసనీయత, ఇతరుల పట్ల వ్యవహరించే తీరు వంటి విలువలు ‘హార్డ్వేర్’ వంటివని వివరించారు. మనపై ఆధారపడిన వారితోనే కాకుండా మనకు ఎలాంటి ప్రయోజనం చేయని వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తామన్నదే వ్యక్తిత్వానికి ముఖ్యమైన కొలమానం అని ఆయన అన్నారు. వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడం, ఒత్తిడికి లోనవ్వక పట్టుదలతో ముందుకు సాగడం, నిరంతరం నేర్చుకోవడం వంటి లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ఎండీ సూచించారు.
విద్యార్థులు జ్ఞానంతో పాటు విలువలను కూడా జీవితంలో ఆచరించాలని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది అన్నారు. స్నాతకోత్సవం అనేది విద్యార్థుల జ్ఞానం, పట్టుదల, విజయాల సందర్భమే కాకుండా, వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే ఘట్టమని ఆయన తెలిపారు. అనంతరం నిట్ సంస్థలో విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను బిద్యాధర్ సుబుది వివరించారు. 2026-27 విద్యా సంవత్సరంలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త ఎం.టెక్ కార్యక్రమాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో బీటెక్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ లో ఎం.ఏ. కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు.

బీటెక్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్అండ్ మెషిన్ లెర్నింగ్ను తప్పనిసరి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశోధన రంగంలో 162 పరిశోధనా ప్రాజెక్టులకు సుమారు రూ.53.63 కోట్ల నిధులు లభించాయని, 2025- 26లో 1,771 పరిశోధనా వ్యాసాలు, 617 కాన్ఫరెన్స్ పేపర్లు, 123 బుక్ చాప్టర్లు ప్రచురితమయ్యాయని డైరెక్టర్ వెల్లడించారు. ఈకాలంలో 36 పేటెంట్లు మంజూరు కాగా 98 పేటెంట్లు దాఖలయ్యాయి అని ఆయన వివరించారు.
సంస్థలో సుమారు రూ.900 కోట్ల విలువైన మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త హాస్టళ్లు, లెక్చర్ హాల్ కాంప్లెక్సులు, అకడమిక్ బ్లాక్, 2,500 సీట్ల ఓపెన్ యాంఫిథియేటర్, 500 సీట్ల క్యాఫెటీరియా, నార్త్ సౌత్ అండర్ పాస్ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఇందులో భాగమని ఆయన చెప్పారు. ప్లేస్మెంట్లలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 93.94 శాతం, పీజీ విద్యార్థుల్లో 80.78 శాతం మంది ఉద్యోగాలు పొందారని, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సగటు వేతనం రూ.18.54 లక్షలు, అత్యధిక దేశీయ ప్యాకేజీ రూ.1.27 కోట్లు నమోదైందని నిట్ డైరెక్టర్ తెలిపారు.