NEET paper leak : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీజేపీ చేపట్టిన ఆందోళనతో ఈ అంశానికి జాతీయస్థాయిలో ప్రచారం లభించింది. ఈ అంశంలో కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేపర్ లీకేజీని కేంద్రం సీరియస్గా తీసుకుంది. పేపర్ లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందించనుంది. కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి.
నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న చట్టాలకు కీలక సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని కేంద్రం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం ప్రకటించారు. జవాబుదారీతనం ఉండేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందిస్తామన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై ఒక వీడియో విడుదల చేశారు. పేపర్ లీకులను అరికట్టేలా కఠిన చట్టాలు తెస్తామని, దీనిపై కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే పేపర్ లీకులపై విచారించేందుకు ఢిల్లీ కోర్టుల ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటవ్వగా మరో నాలుగు కోర్టులను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం కొత్తగా తీసుకురానున్న చట్టం ప్రకారం.. పేపర్ లీకే కేసులను త్వరితగతిన విచారిస్తారు.
అది కూడా నిర్దిష్ట కాలపరిమితితో. ప్రతి రోజూ విచారణ జరుగుతుంది. ఈ కేసులను త్వరగా విచారిం, దోషులకు త్వరగా శిక్ష పడేలా చేస్తారు. ఇప్పటికే పేపర్ లీకేజీలకు సంబంధించి కొన్ని చట్టాలున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులకు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. ఈ కేసులో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఈ శిక్షలను కొత్త చట్టంలో పెంచనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే.. అది కూడా వచ్చే వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.