ప్రచారంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో దూసుకుపోతున్నది. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా తీసిన ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం బతుకమ్మలు, కోలాటాలు, కళాకారుల విన్యాసాల నడుమ అశేషంగా తరలివచ్చిన శ్రేణులు, అభిమానులతో సాగిన భారీ ర్యాలీలతో వరంగల్ తూర్పు, ములుగు కేంద్రాల్లో గులాబీ జాతర కొనసాగింది.
ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘జయహో బీఆర్ఎస్’, ‘జై కేసీఆర్’ అంటూ కార్యకర్తల నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. అభ్యర్థులు బైక్ ర్యాలీలు, రోడ్షోల ద్వారా ఊరూరా పర్యటించి ప్రజలను కలిశారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ మమేకమై వారి బాగోగులు తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలతో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు.