హనుమకొండ, ఏప్రిల్ 24 : బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ 49,50 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొనగా బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా కళాకారుల ఆటా, పాటా, మిమిక్రీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉర్రూతలూగించింది. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం బండా ప్రకాశ్ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్య పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 65వేలకు పైగా కుటుంబాలు ఉంటే ఇందులో 45వేల మందికి పైగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షా తెలంగాణకు ఏమైనా ఇస్తాడనుకుంటే ఉన్న ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం దురదృష్టకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నాటకాలు అడుతోందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వని కేంద్రం ఐటీఐఆర్ను ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. బీజేపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అర్హులందరికీ ఇండ్ల పట్టాలు తప్పకుండా ఇస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మే నెలలో నిర్వహించిన కార్మిక దినోత్సవాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్మిక దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు.
మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ
గల్లీలకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ నాయకులను బీఆర్ఎస్ శ్రేణులు దీటుగా ఎదుర్కొవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో గుడిసెవాసులకు పట్టాలు అందజేయాలని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుడిసె వాసుల కలను సాకారం చేసిందన్నారు. 58, 59 జీవోలను తీసుకొచ్చి సీఎం కేసీఆర్ పట్టాలు అందజేసి గుడిసెవాసులకు భద్రత, భరోసా కల్పించారన్నారు. బుధవారం కలెక్టర్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్లమ్ ఏరియాల్లో పర్యటించి, పరిస్థితులను తెలుసుకుని అర్హులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.
కష్టకాలంలో అండగా నిలిచిన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. ఇంటి స్థలం ఉన్నవారికి గృహాలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించనున్న నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని చీఫ్ విప్ కోరారు. అంతకముందు పలువురు సమస్యలను చీఫ్ విప్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్లు ఏనుగుల మానస, నెక్కొండ కవిత, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సమద్, వెంకటేశ్వర్రావు, విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ 49వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రజిత, నాయకులు మాడిశెట్టి శివశంకర్, ఏనుగుల రాంప్రసాద్, నెక్కొండ కిషన్, రాజమణి, ఆయా డివిజన్లలోని టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.