హనుమకొండ, జూన్ 27 : పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం పోరాటాల గడ్డ వరంగల్ నుంచే భూ పోరాటం ప్రారంభిస్తున్నామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం దిగొచ్చే వరకూ కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పేదల గుడిసెలను ప్రభుత్వం కక్షగట్టి ఇళ్ల కూల్చివేతకు పాల్పడడంపై హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పారు వద్ద ప్రధాన రహదారిపై గుడిసెవాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు భారీ ర్యాలీగా వెళ్తున్న వామపక్ష నాయకులను అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వామపక్ష నేతలకు మధ్య తోపులాట జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సహా వామపక్ష రాష్ట్ర, జిల్లా నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సాంబశివరావు, ఇతర నాయకుల అరెస్టును కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

దీంతో అదాలత్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వం పేదలపై కక్ష కట్టడం మానుకోవాలని, పెద్ద పెద్ద భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దృష్టి సారించాలని సూచించారు. హనుమకొండలోని గుండ్ల సింగారంలో, గోపాల్ పూర్లో ప్రభుత్వ భూమి దేనికి ఉపయోగపడుతుందని పేదల ఇళ్లు కూల్చివేశారని ప్రశ్నించారు.
కూల్చివేతలను అధికారులపై నెట్టేయడం సరికాదని, అధికారులు కూల్చివేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకమై అండగా ఉంటాయని, ప్రభుత్వం తక్షణమే గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై ఒకటిన హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పికెటింగ్ నిర్వహించి, జూలై 6న హైదరాబాద్ ఇందిరాపారు వద్ద రాష్ట్రస్థాయిలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. హిట్లర్ పాలన కొనసాగిస్తామంటే ప్రజలు ఊరుకోరని అన్నారు. గుడిసెలు కూల్చివేసిన ప్రాంతంలోనే తిరిగి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న ఖమ్మంలో, నేడు వరంగల్లో గుడిసెలు కూల్చివేసిన ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే ఈ ప్రభుత్వాన్నే పేదలు కూల్చి వేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు తదితర రాష్ట్ర జిల్లాల నాయకులు పాల్గొన్నారు.