మంత్రి కేటీఆర్ ఈనెల 23న హనుమకొండకు రానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. హనుమకొండ రాంనగర్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో రూ.66 కోట్లతో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కుడా మైదానంలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకనే బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు
నయీంనగర్, మార్చి 16 : హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని నిత్య బాంక్వెట్ హాల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ర్టాలకు మన సంక్షేమ పథకాలు ఆదర్శమైతే, బీజేపీకి మాత్రం మింగుడుపడడం లేదన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోని ప్రజల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు, పార్లమెంట్ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఈడీ దాడులు చేస్తున్నారన్నారు. దేశంలోని మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని ఎమ్మెల్సీ కవిత పోరాడుతుంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు చేయిస్తోందన్నారు.
ప్రజాస్వామ్యంపై తమకు అపారమైన నమ్మకం ఉందని, కవిత కడిగిన ముత్యంలా బయటపడుతుందన్నారు. మహిళ అని చూడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే మహిళలు ఊరుకునే పరిస్థితిలో లేరని, దేశ ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దీనికి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లిన పార్టీలు, సంస్థలపై ఈడీ, సీబీఐ దాడులు చేయడం సరికాదన్నారు. కక్ష పూరితంగా క్రిస్టియన్ సంస్థలు, ముస్లిం మైనార్టీలు నడిపిస్తున్న సంస్థ్ధలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీవైపు ఉన్నారని, దేశంలో మతాలు, కులాలకు అతీతంగా తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలను అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అనేక పార్టీ కార్యక్రమాలతోపాటు తొమ్మిదేళ్ల నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఏప్రిల్ 14న దేశంలో ఎక్కడా లేని విధంగా 120 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు.
అక్టోబర్ నెలలో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ నెల 23న నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పశ్చిమ నియోజకవర్గంలో 46 వేల మంది బీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని చీఫ్విప్ తెలిపారు. సుమారు రూ.66కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడ వీధులు, రూ.25కోట్లతో హనుమకొండ బస్టాండ్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.