ఏటూరునాగారం, ఫిబ్రవరి 19 : మేడారం ఆదివాసీ మ్యూజియంలో ఈనెల 21నుంచి 23 వరకు కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లకోసారి జరిగే జాతరకు వివిధ ప్రాంతాలకు చెందిన కోటి మంది భక్తులు వస్తున్నందున తమ తెగలు, ఇలవేల్పుల చరిత్రను చాటి చెప్పేందుకు సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీకి చెందిన కోయ గిరిజనులు కొలిచే ఇలవేల్పులను వారి తలపతులు మేడారం తీసుకురానున్నట్లు చెప్పారు.
సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకోవడం వల్ల ఇలవేల్పుల ప్రాంతాల్లో భక్తిభావం పెరుగుతుందని కోయల విశ్వాసం ఉందన్నారు. ఇలువేల్పుల్లో కోయ తెగ గోత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కలెక్టర్, ఐటీడీఏ పీవో కోయ గిరిజన ప్రతినిధులు పాల్గొంటారని ప్రభాకర్ తెలిపారు.