న్యూశాయంపేట : దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) పూర్తిగా అధర్మ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి ( Enugula Rakesh Reddy) ఆరోపించారు. బుధవారం న్యూశాయంపేటలో ధ్వంసానికి గురైన హనుమాన్ ఆలయ ప్రదేశాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు.
హనుమకొండలో హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హనుమకొండకే కీడని అన్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు, ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే విగ్రహం ధ్వంసం విషయంలో మౌనంగా ఉండడం దుర్మార్గమని అన్నారు. ఈ కీడు పోవాలంటే ఇక్కడ పాప పశ్చాత్తమం కోసం శాంతి హోమం నిర్వహించి ప్రభుత్వమే విగ్రహ పునఃప్రతిష్ఠాపన చేయాలని డిమాండ్ చేశారు.
మొన్నటి వరకు పేదల ఇళ్ల మీద, భూములు మీదపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవాలయాల మీద పడటం సిగ్గుచేటని విమర్శించారు. వరంగల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు అందరూ తడిబట్టలతో స్నానం చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశంలోనే హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన చేసి, ఆలయ భూములను రక్షించాలని రాకేష్రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా 144 సెక్షన్ పెట్టినట్టు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన వెంట న్యూశాయంపేట హనుమన్ భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.