తలమడుగు, ఆగస్టు 6 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం పల్లి(బీ) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ (48) తనకున్న ఐదెకరాల భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖర్చులు పెరగడం, ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాడు.
అతనికి సీతగొంది దకన్ గ్రామీణ బ్యాంకులో సుమారు రూ.3 లక్షల పంట రుణం ఉండగా, అదనంగా సుమారు రూ.6 లక్షల ప్రైవేట్ అప్పులు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నెల 4వ తేదీన సాయంత్రం పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.