నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 19 : తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు చేయించుకునేందుకు 18ఏళ్లు పైబడిన వాళ్లు కేంద్రాలకు వందలాదిగా తరలిరావడం కనిపించింది. ఇంకా 99రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా అధికారయంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అవసరమైన శిబిరాలు నెలకొల్పి, తగిన సౌకర్యాలు కల్పించింది. మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కంటి వెలుగు సెంటర్లను ప్రారంభించి తాము కూడా కంటి పరీక్షలు చేయించుకుని స్థానికుల్లో భరోసా నింపారు. శిబిరాల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.
పాలకుర్తి మండల కేంద్రం, కొడకండ్ల మండలం రామవరం, రాయపర్తి మండలం కేంద్రంలో కంటి వెలుగు శిబిరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. మహబూబాబాద్ పట్టణంలోని గుమ్ముడూరు పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ అధ్యక్షురాలు బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్ కలిసి కంటివెలుగు ప్రారంభోత్సవం చేశారు. హనుమకొండలోని ఐదో డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీహాల్, నాలుగో డివిజన్లోని బాసిత్నగర్ పాఠశాలలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట మండలంలోని చెన్నారం, వర్ధన్నపేట 7వ వార్డులోని కోనాపురంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, కరీమాబాద్లోని ఉర్సు సీఆర్సీ సెంటర్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట పట్టణం, మండలంలోని ఇటుకాలపల్లి, భాంజీపేట, నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, నల్లబెల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జనగామ జిల్లా కేంద్రంలోని 5వ వార్డు బాణాపురం, 1వ వార్డు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ఘన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారామపురం, గిరిపురంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పీహెచ్సీ, చిట్యాల మండలం ఒడితల గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కాటారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ములుగు జిల్లా కేంద్రంలోని జీపీ కార్యాలయం, గోవిందరావుపేట మండలం చల్వాయి జీపీ ఆవరణలో కలెక్టర్ కృష్ణఆదిత్య, జనగామ జిల్లా చిలుపూరు మండలం నష్కల్లో జడ్పీ అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి కంటివెలుగు శిబిరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. భీమదేవరపల్లి మండలం ములుకనూరు, వంగర, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్లో హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, వరంగల్లోని రంగశాయిపేట మహిళా స్వశక్తి భవన్లో నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు.
మహబూబాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ప్రతి కంటి వెలుగు శిబిరంలో 5 టేబుళ్లు వేసి తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో విధమైన సేవలు అందిస్తూ కార్యక్రమాన్ని సులభతరంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
టేబుల్-1 : ఇక్కడ ఆరోగ్య పత్రం నమోదు చేస్తారు. ఇద్దరు ఆశ కార్యకర్తలు పేషెంట్కు సంబంధించిన వివరాలు (పేరు, ఇంటిపేరు, ఆధార్, ఫోన్నంబర్) సేకరిస్తారు. తర్వాత దృష్టి పరీక్ష కేంద్రానికి పంపుతారు.
టేబుల్-2 : దృష్టి కేంద్రం వద్ద ఆశ కార్యకర్త ఉంటుంది. స్నెల్లెస్ చార్ట్లతో దగ్గర, దూరం చూపును పరీక్షిస్తారు. మూడు మీటర్ల దూరం నుంచి ఆరు మీటర్ల దూరం వరకు గుర్తులు గుర్తించే అవకాశం ఉంటుంది. రెండు వరుసల అక్షరాలతో నాలుగు విభిన్న దిక్కులతో ఉండే టంబ్లింగ్ ఈ అక్షరంతో ముద్రించి ఉంటుంది. మొదటి వరుసలో పెద్ద అక్షరం ఉండి, తరువాత వరుసల్లో అక్షరాల సంఖ్య పెరుగుతూ, వాటి సైజు తగ్గుతూ వచ్చేలా ఉంటుంది. రోగిని పరీక్షించేటప్పుడు, చదవడం లేదా ఎటువైపు కొమ్ములు ఉన్నాయో గుర్తించి చెప్పాల్సి ఉంటుంది. ఈ విధానంలో దగ్గర, దూరపు చూపును పరిశీలిస్తారు.
టేబుల్-3 : ఇక్కడ షుగర్, బీపీ ఉన్నాయా? తెలుసుకుంటారు. ఉన్నవారి వివరాలు సేకరిస్తారు. దృష్టిలోపం ఉందా, ఇప్పటికే ఏమైనా కంటి ఆపరేషన్లు అయ్యాయా?, కళ్లు ఎర్రబారడం, నీరు కారడం తదితర వివరాలు సేకరిస్తారు. కంటి ముందు, లోపలి భాగాలను పరీక్షిస్తారు.
టేబుల్-4 : ఇక్కడ ఆటో రిఫ్రాక్టర్ ద్వారా వ్యక్తి దగ్గర, దూరపు చూపును అంచనా వేయడంతో పాటు కళ్లజోడు అవసరమా?, లేదా నిర్ధారిస్తారు. అనంతరం టార్చ్లైట్ ద్వారా చివరి సారిగా పరీక్షించి మందులు రాయడంతో పాటు కళ్లద్దాలను రెఫర్ చేస్తారు. డాక్టర్ సూచించిన మందులు, కళ్లద్దాలను సిబ్బంది అందిస్తారు.
టేబుల్-5 : తేలిక పాటి కంటి లోపాలు గుర్తించిన డాక్టర్లు ఇక్కడే అవసరమయ్యే అద్దాలను పంపిణీ చేస్తారు. దృష్టి లోపంలో పెద్ద సమస్య ఉంటే అద్దాల సైజు రాసుకొని వాటిని ఆర్డర్ ద్వారా తెప్పిస్తారు. ఇవి ఒకటి, రెండు రోజుల్లో రోగులకు చేరేలా కృషి చేస్తారు. కళ్లద్దాలు ఇచ్చిన తర్వాత వాటిని ధరించిన వారి ఫొటోను ట్యాబ్లో సేవ్ చేస్తారు. ముందుగా నమోదు చేసిన వివరాలతో పోల్చి చూసుకొని ఓకే చేస్తారు. దీంతో కంటి పరీక్ష ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.
పథకం మంచిగున్నదా?లబ్ధిదారు సోమలింగంతో మంత్రి ఎర్రబెల్లి సంభాషణ
పాలకుర్తి రూరల్, జనవరి 19 : కంటి వెలుగు శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో మంత్రి దయాకర్రావు లబ్ధిదారు కత్తుల సోమలింగంతో కార్యక్రమంపై ముచ్చటించారు. పథకం ఎలా ఉందని అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. అవి వారి మాటల్లోనే..
మంత్రి దయాకర్రావు : ఏం పేరు?
లబ్ధిదారు: కత్తుల సోమలింగం సారు.
మంత్రి: ఏ ఊరు..
లబ్ధిదారు: అయ్యా మాది పాలకుర్తి
మంత్రి: కంటి చూపు ఇబ్బంది ఉన్నదా?
లబ్ధిదారు: కండ్లు మంచిగ కనిపిస్తలేవు సారు..
మంత్రి: డాక్టర్లు పరీక్షలు చేసిన్రా?
లబ్ధిదారు: చేసిన్రు సారు..
మంత్రి: ఈ పథకాన్ని ఎవరు తెచ్చిన్రో తెలుసా?
లబ్ధిదారు: తెలుసు సారు..
మన ముఖ్యమంత్రి సారు కేసీఆర్..
మంత్రి: ఈ పథకం ఎట్లున్నది?
లబ్ధిదారు: మంచిగున్నది సారు.. మా అసోంటి పేదలకు ఎంతో ఉపయోగం. కండ్లు కనపడనోళ్లకు ఉచితంగ పరీక్షలు చేసి అద్దాలిచ్చుడు గొప్ప విషయం.
మంత్రి: సీఎం కేసీఆర్ సార్ను గుర్తుంచుకుంటవా?.. రూ.250కోట్లతోని ఈ పథకం అమలు చేస్తున్నడు..
లబ్ధిదారు: మా గుండెల్లో పెట్టుకుంటం సారు.. నా పాణమున్నంత దాకా సీఎం కేసీఆర్ సారును మరువ. పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన కేసీఆర్ సారు నా అసోంటోళ్లకు పెద్ద కొడుకులాంటోడు.
మంత్రి: నవ్వుతూ.. సోమలింగానికి కళ్లద్దాలను స్వయంగా తొడగడంతో అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. సోమలింగంతో పాటు మరో ఇద్దరికి మంత్రి స్వయంగా కళ్లద్దాలు పెట్టి సంతోషపరిచారు.
పెద్ద సారు కడుపు సల్లంగుండ..
– నాతి ఎల్లమ్మ, దేశాయిపేట
పోచమ్మమైదాన్, జనవరి 19: సీఎం పెద్ద సారు కడుపు సల్లంగుండ.. ముందటేడు కళ్లు మస కబారినట్లు ఉంటె సూపించిన. గప్పుడు మంచిగనె కనిపించేటియి. గిప్పుడు మల్ల కండ్లకు ఏమైందో సక్కగ కనబడుతలేవు. మల్ల కళ్ల పరీచ్చలు సేస్తుండంటే వచ్చిన. గట్లనే గుడిసెలో ఉన్న మావోళ్లకు కూడా సెప్పుత.
కళ్లజోళ్లు ఇచ్చిన్రు..
– జోడు రాజయ్య, మహదేవపూర్
మహదేవపూర్, జనవరి 19 : నేను తాపీమేస్త్రీ పనిచేస్త. కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడేది. మహదేవపూర్లో కంటి పరీక్ష చేయించుకున్న. ఉచితంగ కళ్ల జోళ్లు ఇచ్చిన్రు. ఇప్పుడు కంటి చూపు మంచిగ కనబడతాంది. సర్కారు పేదలకు అన్ని విధాల అండగా ఉంటాంది. సీఎం కేసీఆర్ సారును మరిచిపోం.
పెద్ద కొడుకోలె అనిపించిండు
– చాడ కౌసల్య, గడ్డిపల్లె(రేగొండ)
రేగొండ, జనవరి 19: కేసీఆర్ సారు నాకు పెద్ద కొడుకోలె అనిపించిండు. కళ్లు సక్కగ కనిపించనోళ్లకు అద్దాలిత్తాండు. ఆపరేషన్లు కూడా చేయిత్తాండు. అప్పట్ల కంటి పరీక్షలు చేసి నాకు అద్దాలిచ్చిండు. రెండు సంవత్సరాలు ఆటినే పెట్టుకున్న. గిప్పుడు మల్ల పరీక్షలు చేసి అద్దాలి త్తాండంటె సంతోషంగుంది. పైస కర్చులేదు. కేసీఆర్ సారు కడుపు సల్లగుండాలె. ఏ కట్టం వచ్చినా అందుకుంటాండు. మల్ల ముఖ్యమంత్రిగ ఆయనే ఉండాలె.
సూపు మంచిగ కనబడుతాంది
– కత్తుల ఎల్లయ్య, రాయపర్తి
రాయపర్తి, జనవరి 19: నాకు శాన ఏండ్ల సంది సూపు సక్కగ లేకుండె. ఎటుజూశినా మసక మసకగ కనబడేది. దగ్గర సూపు మొత్తమే కనబడకపోయేది. మందులు వేసుకునేందుకు కూడా ఇబ్బందయ్యేది. ఇయ్యాల మంత్రి దయాకర్రావు సారు నాకు దగ్గరుండి కండ్ల పరీక్షలు చేయించి అద్దాలు ఇప్పించిండు. ఇప్పుడు నా సూపు మంచిగ కనబడుతాంది.