రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందికి అత్యాధునిక యంత్రాలతో కంటి పరీక్షలు నిర్వహించారు. 15,277 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మారుతున్న జీవనశైలితో ఏటా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ ను 2023 జనవరి 18 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో 17 ప్రత్యేక బృందాలతో 70 రోజుల పాటు పరీక్షలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మరోమారు కంటివెలుగు కార్యక్రమాన్ని చేపడుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): రెండో విడుత ‘కంటి వెలుగు’కు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో ఏటేటా కంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ 2018లో ప్రయోగాత్మకంగా కంటి వెలుగుకుశ్రీకారం చుట్టి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయించారు. తొలివిడుతలో ములుగు జిల్లాలోని 174 గ్రామపంచాయతీల పరిధిలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 1,70,809మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15,277మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
వీటితో పాటు కంటి పొర, ఇతర సమస్యలతో బాధపడుతున్న మరో 8,497మందికి ఆపరేషన్ చేయించారు. అప్పట్లో ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. దీంతో మరోసారి కంటి వెలుగు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే యేడాది సంక్రాంతి తర్వాత జనవరి 18వ తేదీ నుంచి రెండో విడుత కంటి వెలుగు ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి జిల్లాలో 17 బృందాల ద్వారా 2,38,976మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. 70 రోజుల్లో కంటి వెలుగును పూర్తి చేసేందుకు 250 మంది వైద్య సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. 20 ఏఆర్ మిషన్లు, 20 లెన్స్ బాక్సులు, 20మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది.
జనవరి 18 నుంచి రెండో విడుత
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి రెండో విడుత కంటి వెలుగు పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య జిల్లా ప్రోగ్రాం అధికారులతో చర్చించి అవసరమైన బృందాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో గ్రామాల వారీగా వివరాలను సేకరించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేయనున్నారు. ఆపరేషన్ అవసరమైన వారిని వరంగల్లోని ప్రాంతీయ కంటి దవాఖానకు రెఫర్ చేయనున్నారు. కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయనుండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 17 బృందాలతో 250మంది సిబ్బంది పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ప్రతీ పీహెచ్సీ పరిధిలో కంటి వెలుగు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరో రెండు బృందాలను సిద్ధం చేశాం. ప్రత్యేకంగా ప్రోగ్రాం అధికారిని నియమించి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం అసౌకర్యం కలుగకుడా పరీక్షలు నిర్వహిస్తాం.
– డాక్టర్ అల్లెం అప్పయ్య, డీఎంహెచ్వో ములుగు