న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలో కులాంతర వివాహం చేసుకునే జంటకు రూ.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అర్హత కలిగిన జంటలకు రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేసే డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనం కేవలం దంపతులలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి(ఎస్సీ) చెందిన వారై, మరొకరు ఎస్సీయేతర వర్గానికి(అంటే జనరల్ లేదా ఓబీసీ వర్గానికి) చెందినవారైనప్పుడు మాత్రమే లభిస్తుంది. ఆ వివాహం వారిద్దరికీ మొదటి వివాహమై ఉండాలి. అంటే వారిలో ఎవరూ ఇదివరకే వివాహం చేసుకొని ఉండకూడదు.
పథకంలో కీలక అంశాలు
వివాహం చట్టపరంగా నమోదైతేనే ఈ పథకానికి చెందిన ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం వివాహం తప్పనిసరిగా హిందూ వివాహ చట్టం, 1955 లేదా ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదై ఉండాలి. వివాహిత జంటలు తమ వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. సమాజం నుండి అంటరానితనాన్ని, కులపరమైన విభజనలను తొలగించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారు, సంబంధిత నిబంధనల ప్రకారం తమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకాన్ని ఈ ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నది. అంతేగాకుండా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సొంత కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం రాష్ర్టాల వారీగా మారుతూ ఉంటుంది. ఇది రూ.50,000 నుండి రూ.5లక్షల వరకు ఉంటున్నది.