న్యూఢిల్లీ: దేశంలో శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించేందుకు ఇథనాల్ కీలక పరిష్కారంగా మారుతున్నది. ఈ20 పెట్రోల్ వాడకం సాధారణమవుతుండంతో ఇథనాల్కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇథనాల్ తయారీకి ప్రధాన ముడి పదార్థాలలో ముఖ్యమైనది చెరుకు. నీతి ఆయోగ్ ఇథనాల్ రోడ్ మ్యాప్ ప్రకారం చెరుకు ఆధారిత ఇథనాల్ తయారీలో మొత్తం నీటి వినియో గం ఒక లీటర్ ఇథనాల్కు 3,000 లీటర్లుగా ఉంది. ఇందులో అత్యధిక భాగం ఇథనాల్ ఫ్యాక్టరీల లోపల కాకుండా, నేరుగా చెరకు సాగుకే వినియోగమవుతున్నది. దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే నీటి వనరులపై అపారమైన భారాన్ని మోపుతున్నది. ఇటువంటి తరుణంలో ఇథనాల్ ఉత్పత్తిలో నీటి వినియోగంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ20 విధానం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని మండ్యలోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెర్ డాక్టర్ కేవీ కేశవయ్య తెలిపారు. సాధారణ నీటి పారుదల విధానాన్ని వీడి, బిందు సేద్యం వైపు దృష్టి సారించాలన్నారు. చెరకు, మక్కజొన్న, వరి లాంటి నీటిని అధికంగా కోరే పంటలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేశవయ్య సూచించారు. భూగర్భ జలాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రాంతాల్లో నీటిని అధికంగా కోరే పంటలను సాగుచేయడానికి ఇథనాల్ విధానం అదనపు భారంగా మారనున్నదనడంలో సందేహం లేదు.