NewYork : అమెరికా (USA) లోని న్యూయార్క్ నగరం (NewYork City) లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు సబ్వే ట్రాక్ (Subway Track) పై పడిపోయాడు. అతడిని కాపాడేందుకు అతడి స్నేహితురాలు ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో రైలు దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరూ అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున మాన్హట్టన్లోని ఓ మెట్రో స్టేషన్లో జరిగింది. భారత సంతతికి చెందిన నవమ్ కౌల్, మలైకా చిత్రే అనే ఇద్దరు స్నేహితులు రైలు కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నవమ్ కౌల్ అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. అది గమనించిన మలైకా చిత్రే అతడిని రక్షించేందుకు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ట్రాక్పైకి దూకింది. అయితే వారిద్దరూ పైకి ఎక్కేలోపే వేగంగా వచ్చిన రైలును ఆపడం డ్రైవర్కు సాధ్యం కాలేదు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మృతులిద్దరూ న్యూజెర్సీలోని సమీప పట్టణాల్లో పెరిగారు. 2024 లోనే ఇద్దరూ ప్రతిష్ఠాత్మక రట్జర్స్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. నవమ్ కౌల్ కుటుంబం నేపాల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అతడు బిజినెస్ డిగ్రీ పూర్తిచేసి, ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్బర్గ్లో డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇక మలైకా చిత్రే టెంపుల్ యూనివర్సిటీలో ఫార్మసీలో డాక్టరేట్ చేస్తూనే అకాడియా ఫార్మాస్యూటికల్స్లో క్వాలిటీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తోంది.
అయితే ఈ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడంపై మలైకా చిత్రే కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిద్దరూ ఒకే దక్షిణాసియా బృందంలో ఉంటూ, పండుగలు కలిసి జరుపుకునే మంచి స్నేహితులని కౌల్ స్నేహితుడి తండ్రి ఒకరు తెలిపారు. ఈ విషాద ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది.