వర్ధన్నపేట, సెప్టెంబర్ 2 : మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వీవోఏలకు సీఎం కేసీఆర్ రాఖీ పండుగ కానుకగా గౌరవ వేతనాన్ని రూ.8వేలకు పెంచిన సందర్భం గా క్యాంపు కార్యాలయంలో మండల వీఏవోల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వీవోఏలకు కేవలం రూ.500 నామమాత్రపు వేతనాన్ని అందించి, రోజుల తరబడి పనిచేయించుకున్నాయన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా వీవోఏల పనిని గుర్తించి రూ.6వేల వేతనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. వీవోఏలు సమర్థవంతంగా పనిచేయాలనే భావనతో రాఖీ పండుగ కానుకగా రూ.8వేలకు వేతనాన్ని పెంచినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా కేవలం రూ.6వేల కోట్ల రుణాలు మాత్రమే అందేవన్నారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు అందుతున్నాయని వివరించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో వీవోల భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే లక్ష్యంతో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు మం డలాల్లో అధిక సంఖ్యలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అంతేకాక, రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలోని వీవోఏలందరికీ సోదరుడిగా చీరెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కూడా మహిళా సం ఘాల సభ్యులు, వీవోఏల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రమేశ్ చిత్రపటాలకు వీవోఏలు పాలాభిషేకం చేశారు. గౌరవ వేతనాన్ని రూ.8వేలకు పెంచడంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని పలువురు మహిళలు తెలిపారు. అలాగే, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, ఐదుగురికి రూ.1.97లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి అందజేశారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ ఎల్లావుల లలితాయాదవ్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, వీవోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, జిల్లా కమిటీల బాధ్యులు, వీవోల మండల కమిటీ బాధ్యులు, వీవోఏలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు
కాశీబుగ్గ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందిస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం 3, 14వ డివిజన్లలో లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 31 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఆరుగురికి రూ.2.78లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాకుమార్ యాదవ్, కార్పొరేటర్లు జన్ను షీబారాణి అనిల్, తూర్పాటి సులోచనా సారయ్య, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, నాయకులు బుద్దె వెంకన్న, బుద్దె శ్రీనివాస్, కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, పత్రి రాజపోశాలు, పసులాది మల్లయ్య, సిలువేరు శ్రీనివాస్, గండ్రాతి భాస్కర్, గంధం గోవిందు, జన్ను రాజయ్య, మంతూర్తి కుమార్యాదవ్, జన్ను సతీశ్, జన్ను సారంగపాణి, ఈట్యా సతీశ్, నామసాని నాగరాజు, ఇట్యాల శ్రీనివాస్, చక్కస్వామి, ఇట్యాల శిరిషా సతీశ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.