బోరుబావులు వాటికవే ఉబికివస్తున్నయి..
చెక్డ్యాములు పొంగి పొర్లుతున్నయి..
చెరువులే కాదు.. బావులూ నిండుకుండల్లా తొణుకుతున్నయి.
వాగులు వంకలు పరవశించి పారుతున్నవి..
భూగర్భమంతా నిండిన నీళ్లతో తెలంగాణ దమ్మారా దూప తీర్చుకుంటున్నది..
హనుమకొండ సబర్బన్, మార్చి 21 : సమస్త జీవకోటి మనుగడకు జలమే జీవనాధారం. జీవ పరిణామ క్రమం జలం నుంచే మొదలైంది. గాలి, నీరు లేకుంటే ఏ ప్రాణికీ మనుగడ లేదు. ఒకప్పుడు కేవలం కాలితో భూమిని తన్నితే చాలు నీటి ఊటలు వచ్చేవట..! ఆ స్థాయి నుంచి నిన్నమొన్నటిదాకా వందల ఫీట్ల వరకు బోర్లు వేసినా చుక్క నీరు దొరకని పరిస్థితికి చేరుకున్నాం. కళ్లముందే నీటి భవిష్యత్తు కనిపిస్తున్నా నీటి వృథాను అరికట్టడంలో, నీటి వనరులను బలోపేతం చేయడంలో గత ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ నీటి గోసను తీర్చాలన్న సంకల్పం.. నీటి కటకట లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు తెలంగాణలో కళ్లెదుట కనిపిస్తున్నాయి. ‘కాళేశ్వరం’, ‘దేవాదుల’ ద్వారా తరలివస్తున్న గోదావరి జలాలు.. మిషన్ కాకతీయ ద్వారా ఒడిసిపట్టిన జలాలతో ఇప్పుడు తెలంగాణ దమ్మారా దూప తీర్చుకుంటున్నది. ‘ప్రపంచ జల వనరుల దినోత్సవం’ లక్ష్యానికి మన రాష్ట్రం చేరువలో ఉన్నది.
నీటి ప్రాధాన్యతను తెలిపేలా..
నీటి ప్రాధాన్యతను తెలిపేలా, నీటి వృథాను అరికట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేసేందుకు ఐక్యరాజ్య సమితి ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుతున్నది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును కేటాయించారు. శుద్ధజలం, పారిశుధ్యం ప్రాధాన్యతలను ఈ రోజు గుర్తు చేస్తుంది. ప్రపంచంలో 75శాతం భూభాగం పూర్తిగా నీటిలోనే ఉండగా 25శాతం భూమి మాత్రమే బయట ఉంది. భూగోళంలో ఎక్కువ శాతం నీటితోనే నిండి ఉన్నా అందులో ఒక శాతం నీరు మాత్రమే తాగేందుకు ఉపయోగపడుతుంది.
ఈ ఒక శాతం నీటితోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 750కోట్ల ప్రజలకు తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. చెరువులు, నదులు, భూగర్భ జలాలు మాత్రమే మనం వినియోగించుకునే ప్రధాన నీటి వనరులు. ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగుచూసిన నాగరికతలు మొత్తం నదీ తీరాల్లో వెలుగుచూసినవే. అంతటి ప్రాధాన్యం ఉన్న నీటి వనరులపై ఏమాత్రం ముందుచూపు లేకుండా చాలా మంది వృథా చేస్తున్నారు. కొందరు వ్యర్థాలను నీటి వనరుల్లోకి వదిలి కలుషితం చేస్తున్నారు. మరికొందరు విలువైన నీటిని నేలపాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు నీటి పరిస్థితిని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి, నీట వనరుల రక్షణకు నడుం బిగించింది. 1992 నుంచి ఏటా వరల్డ్ వాటర్ డే నిర్వహిస్తున్నది.
ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణ
భూగర్భ జలాలను కాపాడడంతో పాటు జనాలకు అత్యంత నాణ్యమైన శుద్ధజలం అందించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో అద్భుతమైన రీతిలో 70వేల గొలుసుకట్టు చెరువులు పూర్వకాలంలో వందల ఏండ్ల పాటు తెలంగాణలోని 25లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశాయి. అయితే సమైక్యాంధ్ర పాలకులు ఈ చెరువులను నిర్లక్ష్యం చేయడంతో అన్నీ పూడుకుపోయాయి. కనీస నీటి నిలువ సామర్థ్యం తగ్గగా కొన్ని పూర్తిగా అస్థిత్వాన్ని కోల్పోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మిషన్ కాకతీయ పేరుతో అద్భుత పథకానికి రూపకల్పన చేసి రాష్ట్రంలో ఉన్న 46,531 చెరువులను పునరుద్ధరించారు. 265 టీఎంసీల వర్షపు నీటిని నిల్వ చేసే బృహత్తర ప్రణాళికతో 2014 జూన్లో మిషన్ కాకతీయ పథకం ప్రారంభించారు. సుమారు రెండు లక్షల కోట్లతో అన్ని చెరువులను పూడిక తీయించి ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఈ పనులను ఐదు దశల్లో పూర్తి చేశారు. తద్వారా 14కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికమట్టిని చెరువుల్లోంచి పంట పొలాలకు తరలించారు. దీంతో భూగర్భ జలాలు 6.9శాతం నుంచి 9.2 శాతానికి ఎగబాకాయి. హనుమకొండ జిల్లాలో 700చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ శుద్ధ జలం అందించేందుకు రూపొందించిన మిషన్ భగీరథ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. దీన్ని 2016 ఆగస్టులో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే ప్రారంభించారు. తద్వారా 1.3 లక్షల కిలోమీటర్లు పైప్లైన్ వేసి 24వేల గ్రామాలతో పాటు 65 పట్టణాల్లో ప్రతి ఇంటికి నల్లా బిగించి గోదావరి, కృష్ణా నదుల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ చర్యతో రాష్ట్రంలో అంటువ్యాధులు తగ్గడంతో పాటు శిశు మరణాలు తగ్గాయి. ఫ్లోరైడ్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించింది.
కాపాడుకోకుంటే భవిష్యత్తు కష్టమే..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.60 లక్షల మంది పసిపిల్లలు శుద్ధజలం అందక పలు అంటువ్యాధులకు గురై ప్రాణాలు విడుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు లభిస్తున్నది. దివంగత భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించినట్లు 2050 నాటికి భూమండలం మీద తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడనున్నది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే జనాలు స్నానాలు చేయడం మానేసి రసాయనిక లేపనాలు పూసుకోవాల్సి వస్తుంది.
కెమికల్ బాతింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దు కాపలా కాయాల్సిన సైన్యం నీటి వనరులకు రక్షణగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తలంటుకోవడానికి నీరు లేక నిత్యం స్త్రీ, పురుషులు బోడిగుండుతో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని ఊహించుకుంటేనే భయం వేస్తున్నది. అందుకే ఐక్యరాజ్యసమితి నడుం బిగించి అవగాహన సదస్సుల ద్వారా నీటి వనరులను కాపాడుకునే దిశగా అడుగువేస్తున్నది. 2030 నాటికి అందరికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. అందుకే 2018 నుంచి 2028 దశాబ్దాన్ని వాటర్ ఫర్ సస్టేనెబుల్ డెవలప్మెంట్ (డబ్ల్యూఎఫ్ఎస్డీ)గా పరిగణిస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.