జూలూరుపాడు, ఆగస్టు 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక ‘ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్’ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరంగా ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైన ఈ మహా ప్రదర్శన, పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారి గుండా అట్టహాసంగా సాగింది. వందల సంఖ్యలో చేతులు ఆ భారీ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ముందుకు నడిపిస్తుంటే జూలూరుపాడు పురవీధులన్నీ దేశభక్తి శోభతో వెల్లివిరిశాయి.
ర్యాలీ సాగుతున్నంత సేపు యువత, విద్యార్థులు చేసిన “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. అనంతరం చండ్రుగొండ రోడ్డు కూడలి వద్ద భారీ ఎత్తున మానవహారం నిర్వహించి, దేశ ఐక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు. వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఒకే తాటిపై నడిచి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరంగా సగర్వంగా ఎగరంగా.. జూలూరుపాడులో 1,200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ