స్వరాష్ట్రంలో పరకాల నియోజకవర్గం ప్రగతిబాట పట్టింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో సర్కారు రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. 1200 ఎకరాల్లో దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే ఒక కంపెనీ తన ఉత్పత్తిని ప్రారంభించగా, మరికొన్నింటి ప్రొడక్షన్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. వేల సంఖ్యలో స్థానికులకు ఉపాధి లభించింది. ప్రజల అభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేసింది. పరకాలకు రెవెన్యూ డివిజన్ హోదాను పునరుద్ధరించింది. పేదలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మిస్తున్నది. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పరకాల ముఖచిత్రమే మారిపోయింది.
పరకాల, నవంబర్ 16 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పరకాలలో ప్రత్యేక రాష్ట్రంలో రూపురేఖలు మారాయి. తొమ్మదిన్నరేండ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్ ప్రత్యేక రాష్ట్రంలో తిరిగి వచ్చింది. నియోజకవర్గంలోని గీసుకొండ, సంగెం మండలాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తున్నది. దామెర, నడికూడ కేంద్రాలుగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేయగా పాలన ప్రజలకు చేరువైంది. పలు మండలాలతో పాటు పరకాల మున్సిపాలిటీలో కార్పొరేట్ స్థాయిలో పాలనా భవనాలను నిర్మించుకోగా.. పరకాల ప్రాంత చిరకాల వాంఛ అయిన వంద పడకల దవాఖాన నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పరకాల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ కేటాయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని గీసుకొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి శివారులో 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నెలకొల్పారు. ఈ టెక్స్టైల్ పార్కులో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతుండడంతో మౌలిక వసతులు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తును నిధులును మంజూరు చేసింది. ఇప్పటికే వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.450కోట్లతో అంతర్గత రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మించారు. అంతే కాకుండా కంపెనీలకు అవసరమయ్యే నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. రూ.178కోట్లతో 220కేవీ సబ్స్టేషన్ నిర్మాణం, రూ.100 కోట్లతో నీటి సరఫరా పనులు చేపట్టగా, టెక్స్టైల్పార్కులో వ్యర్థ జలాల శుద్ధీకరణకు రూ.83కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. టెక్స్టైల్ పార్కు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఉపాధికి కేంద్ర బిందువుగా నిలువనుంది. ఇప్పటికే గణేశా ఎకోటెక్, ఎకోపెట్ పరిశ్రమలను నెలకొల్పారు. వీటిలో ఉత్పత్తిని మంత్రి కేటీఆర్ ప్రారంభించగా కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమల స్థాపనకు భూమిపూజ చేసింది. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంతే కాకుండా సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీలు పరిశ్రమల నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవ్వగా మరికొన్ని కంపెనీలు టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, టెక్స్టైల్ పార్కులో పలు పరిశ్రమల నిర్మాణాలు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే నియోజకవర్గం ఉపాధికి కేంద్ర బిందువుగా మారుతుంది.
అభివృద్ధి పరుగులు పెట్టడంతో పరకాల ముఖ చిత్రం మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పరకాల రెవెన్యూ డివిజన్గా కొనసాగుతుండగా అప్పటి టీడీపీ ప్రభుత్వ పాలకులు కుట్రలు చేసి పరకాల నుంచి రెవెన్యూ డివిజన్ను రాత్రికి రాత్రే ములుగుకు తరలించారు. దీంతో పరకాల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైంది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ పరకాలను రెవెన్యూ డివిజన్గా 2018లో ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం నూతన మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు పాలన చేరువైంది. నియోజకవర్గ వ్యాప్తంగా నడికూడ, దామెర కేంద్రాలుగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో పాటు 21తండాలు, శివారు గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రూ.కోట్లతో పాలనాభవనాలను కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. అంతేకాకుండా హనుమకొండ రోడ్డుపై వంద పడకల దవాఖాన నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు, నిర్వహణకు రూ.7.88కోట్లు కేటాయించగా మూడు అంతస్తుల్లో లక్ష చదరపు అడుగుల్లో పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని పరకాల మండలం వెల్లంపల్లి, నడికూడ మండలంలోని చర్లపల్లి, వరికోల్, ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, కటాక్షపూర్, సంగెం మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడంతో పాటు లబ్ధిదారులకు పంపిణీ చేసి, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసింది.