హనుమకొండ, మార్చి 19 : రానున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట తన సొంత నియోజకవర్గమైనా ఇన్ని రోజులు కార్యకర్తలకు దగ్గరగా రాలేకపోయానన్నారు. పార్టీ కట్టుబాట్లకు లోబడి నియోజకవర్గ ప్రజలు, నాయకులకు దూరంగా ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన తన కూతురు కడియం కావ్యకు ఓటు వేయాలని అడిగేందుకు మీ ముందుకు రాలేదన్నారు. పార్టీ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు వచ్చానని తెలిపారు. వర్ధన్నపేట ప్రజలకు కడియం శ్రీహరి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని చెప్పారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏమిటని కడియం ప్రశ్నించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
పదేళ్లలో పార్టీని కొంత నిర్లక్ష్యం చేసిన వాస్తవమేనని, పార్టీ నిర్మాణంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అసలు అమలు కాలేదన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, ఇప్పటివరకు తాను ఎవరినీ మోసం, ద్రోహం చేయలేదన్నారు. తాను ఎంత నిజాయితీగా పనిచేస్తానో తన బిడ్డ కావ్య కూడా అంతే నిజాయితీగా పనిచేస్తుందని కడియం అన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి తాను ఇన్చార్జిగా ఉంటానని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ కమిటీలు వేసుకొని పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. కలిసికట్టుగా పనిచేసి కడియం కావ్యను గెలిపిద్దామని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.